మోడీ నెత్తిన లక్షకోట్లు పెట్టిన చంద్రబాబు..! 30 వేల కోట్లు పెట్టిన నితీశ్..!
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ కు ఈసారి మాత్రం పరిస్ధితులు అంతగా అనుకూలంగా కనిపించడం లేదు. గతంలో రెండుసార్లు తమకున్న భారీ మెజార్టీతో బీజేపీ ఎన్డీయేలోని మిత్రపక్షాల్ని కూడా లెక్కచేసేది కాదు. విపక్షాలను అయితే అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్ లో అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీకి మిత్రపక్షాల్ని పట్టించుకోకుండా వదిలేసే పరిస్ధితి లేదు. ఇదే ఇప్పుడు చంద్రబాబు, నితీశ్ కుమార్ వంటి మిత్రపక్ష నేతలకు వరంగా మారింది.
ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్దాయిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. కానీ గతంలో సునాయాసంగా ఎలాంటి కొత్త హామీలు, పథకాలు, కేటాయింపులు లేకుండా బడ్జెట్లు పెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలమ్మకు ఈసారి మాత్రం కష్టాలు తప్పేలా లేవు. అంతకు మించి ప్రధాని మోడీపై ఒత్తిడి నెలకొంది.

ఇప్పటికే ఎన్డీయేలో కీలకమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి ఈసారి లక్ష కోట్ల కేటాయింపులు చేయాలని కోరారు. అలాగే బీహార్ కు రూ.30 వేల కోట్లు ఇవ్వాలని మరో మిత్రపక్ష నేత నితీశ్ కుమార్ కూడా కోరారు. ఈ రెండూ కలిపితే కేంద్ర ఆహార బడ్జెట్ లో సగానికి సమానం. వీళ్లిద్దరికీ ఆ స్ధాయిలో కేటాయింపులు చేస్తే ఇతర పార్టీలు, రాష్ట్రాలు గగ్గోలు పెట్టడం ఖాయం. దీంతో కేంద్ర బడ్జెట్ లో వీరు కోరినంత కాకపోయినా మెరుగైన కేటాయింపులు చేయక తప్పని పరిస్ధితి మోడీది.
అయితే ఈసారి బడ్డెట్ లో మోడీకి కాస్త ఆర్ధిక వెసులుబాటు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం రిజర్వు బ్యాంకు ఈసారి రికార్డు స్ధాయిలో కేంద్రానికి డివిడెండ్ చెల్లించింది. దీంతో పాటు పన్ను ఆదాయాలూ పెరిగాయి. అదే సమయంలో బీజేపీ మిత్రపక్షాలు తమ రాష్ట్రాల్లో ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతించాలని కోరుతున్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితి కంటే ఒక శాతం ఎక్కువ రుణాలు తీసుకునేందుకు షరతుల్లేని అనుమతివ్వాలని బీహార్ కోరుతోంది. అలాగే ఏపీ 0.5 శాతం అదనపు పరిమితి కోరుతోంది. ఇవన్నీ మోడీని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయని జాతీయ స్ధాయిలో నివేదికలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications