సోనియా ఆదేశాలతో అడ్డు తగిలారు: వాకౌట్పై బాబు

సమావేశంలో తాను లేచి ఎపిలో పరిస్థితుల గురించి మాట్లాడుతుంటే షిండే అడ్డుతగిలారని, అఖిల పక్షంలో మీరు కూడా లేఖ ఇచ్చారని చెప్పారని, అయినా ఆ విషయం అజెండాలో లేదని అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. చిదంబరం కూడా అదే ధోరణిలో మాట్లాడారన్నారు. సోనియా సహచరులకు సంకేతాలు ఇవ్వడంతో వారిద్దరు తన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తొలుత అజెండా ప్రకారం మత సామరస్యం, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉద్యమాలను ఎందుకు అజెండాలో పేర్కొనలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధానికి రెండు లేఖలు రాశానని కానీ, కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి చర్యల్లేవన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు ఎంతో తీవ్రంగా ఉంటే ఉన్నతస్థాయి వేదిక అయిన ఎన్ఐసిలో దానిని ఒక అంశంగా చేర్చి చర్చించరా? అని నిలదీశారు. వేదికపై ఉన్న సోనియా గాంధీ అప్రమత్తమయ్యారు. దీంతో, తొలుత షిండే జోక్యం చేసుకుని.. 'రాష్ట్ర విభజనకు మీరు కూడా లేఖ ఇచ్చారు కదా!?' అని ప్రశ్నించారు. "అవును ఇచ్చాను. అయితే, ఇప్పుడు తలెత్తిన పరిస్థితులను పరిష్కరించరా? ఆందోళన చెందుతున్న ప్రజలకు సామరస్యపూర్వక పరిష్కారం చూపించరా?'' అని బాబు ప్రశ్నించారు.
దీంతో 'అసలు ఆ విషయం అజెండాలో లేదు. కాబట్టి మీరు మాట్లాడటం కుదరదు' అని చిదంబరం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతుంటే కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. 'అయితే మీరు చెప్పాల్సింది చెప్పారు కదా! ఇంకేంటి?' అని చిదంబరం ప్రశ్నించారు. మైక్ కట్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. 'కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేను వాకౌట్ చేస్తున్నాను' అని ప్రకటించి బయటకు వచ్చేశారు.












Click it and Unblock the Notifications