చంద్రయాన్-3 షెడ్యూల్లో మార్పు: ప్రయోగం ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO-ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగం కొంత ఆలస్యం కానుంది. జులై 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ఇంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా, ఒక రోజు ఆలస్యంగా జులై 14న రాకెట్ను నింగిలోకి పంపనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
అయితే, ఆలస్యానికి గల కారణాలను మాత్రం పేర్కొనలేదు. ఈ మిషన్ చంద్రుడిపై రోవర్ను దించేందుకు భారత్ చేస్తోన్న మూడో ప్రయత్నం కావడం గమనార్హం. ఈ మిషన్లో భాగంగా ఎల్వీఎం-3పీ4 రాకెట్తో చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం పూర్తి చేశారు.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) రెండో వాహన అనుసంధాన భవనంలో (ఎస్వీఏబీ) 3900 కిలోల పేలోడ్ను రాకెట్ శిఖర భాగాన అమర్చారు. ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ శాటిలైట్ సెంటర్లో తయారు చేయగా షార్ కు తీసుకొచ్చాక శాటిలైట్ ప్రిపరేషన్ బిల్డింగ్(ఎస్పీబీ)లో ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్తో అనుసంధానించారు.
ఉగ్రహం సుమారు 3,84,000 కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకుంటుంది. తర్వాత చంద్రుని దక్షిణ ధృవంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది. ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో 2019లో చంద్రయాన్-2 మిషన్ను చేపట్టింది. అయితే, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఆర్బిటర్ సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైంది. అయినప్పటికీ.. చంద్రుని చుట్టూ ప్రస్తుతం విజయవంతంగా పరిభ్రమిస్తోంది.
ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని లోపాలను సవరిస్తూ తాజాగా, ఇస్రో చంద్రయాన్-3 చేపట్టింది. సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. 2008లో చంద్రయాన్-1ను చేపట్టింది. ఇది విజయవంతమై చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. కాగా, ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్ చేయగలిగాయి. ఈ మైలురాయిన సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచేందుకు సిద్ధమైంది. తాజాగా, ప్రయోగం విజయవంతమైతే ఇస్రో చరిత్ర సృష్టించినట్లవుతుంది.












Click it and Unblock the Notifications