కుని ఆపరేషన్లు: నాసికరం టాబ్లెట్స్, ఎలుకల మందు
న్యూఢిల్లీ: ఛత్తీస్గడ్లో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించి 13 మంది మహిళలు మరణించిన రెండు వారాలకు డ్రగ్ శాంపిల్ రిపోర్టు వెల్లడైంది. మహిళల కోసం వాడిన టాబ్లెట్స్ సైప్రోసిన్-500 నాసిరకం మందులని, వాటిల్లో ఎలుకల మందు (జింగ్ ఫాస్పైడ్) ఆనవాళ్లు ఉన్నాయని ఈ రిపోర్టు పేర్కొంది.
ఈ రిపోర్టును పోలీసు అధికారులకు అందజేశామని, ఈ కేసు విచారణను పోలీసులు కొనసాగిస్తారని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అమర్ అగర్వాల్ ప్రకటించారు. ప్రాణాన్ని కాపాడాల్సిన మందుల్లో విషపదార్దాలు కనిపించడం చాలా తీవ్రమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డాడు.
రెండు వారాల క్రితం ఛత్తీస్గడ్లోని బిలాస్ పూర్లో ఓ వైద్య శిబిరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 13 మంది మహిళలు మరణించిన విషయం తెలిసిందే. వైద్యపరమైన నిర్లక్ష్యం వల్లనే ఈ మరణాలు సంభవించినట్లు ఆరోపణలు రావడంతో ‘ఎక్స్ప్రెస్ స్టెరిలైజేషన్' విచారణకు ఆదేశించింది.
ఈ సంఘటనకు కారణమైన ఇద్దరు డాక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. మరో ఇద్దరిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. స్టెరిలైజేషన్ క్యాంప్లో ప్రాణాలు కోల్పోయిన మహిళల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతోబాటు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారికి యాభైవేల రూపాయల సాయాన్ని ప్రకటించింది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మరణించిన మహిళల పిల్లలను దత్తత తీసుకోవాలని కూడా ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం నిర్ణయించింది. వారికి రెండులక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్తోబాటు వారికి పద్దెమినిదో ఏడు వచ్చేదాకా ఉచిత విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించారు ముఖ్యమంత్రి రమణ్ సింగ్.