గుజరాత్ లో గెలుపు కోసం దిగజారుతున్నారు. ప్రధాని మోడీపై చిదంబరం ఫైర్ !
న్యూఢిల్లీ: గుజరాత్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్ధాయికి చేరాయి. గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర పదజాలంతో ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు.
పాక్ విషయంలో అభ్యంతరం
పాకిస్థాన్ తో కుట్రకు తెరలేపారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్, హమీద్ అన్సారీల మీద బీజేపీ ఆరోపణలు చేయడం పట్ల కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అభ్యంతరం వ్యక్తం చేశారు.
దిగజారిపోయారు
పాకిస్థాన్ హైకమిషనర్ తో మణిశంకర్ అయ్యర్, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీలు రహస్యంగా భేటీ అయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడంపై చిదంబరం మండిపడ్డారు. గుజరాత్లో గత రెండు రోజులుగా బీజేపీ చేస్తున్న ప్రచారం దిగజారిందని చిదంబరం ఆరోపించారు.
గుజరాత్ లో గెలుపు కోసం
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఎంతకైనా తెగిస్తుందంటూ చిదంబరం ట్వీట్ చేశారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో గెలుపు కోసం మాజీ ప్రధాని, మాజీ ఉప రాష్ర్టపతిలను వివాదంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందా అంటూ చిదంబరం ప్రశ్నించారు.
బీజేపీ చేతిలో అయ్యర్ అస్త్రం
ప్రధాని నరేంద్ర మోడీ నీచరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ సైతం మణిశంకర్ అయ్యర్ పై వేటువేసింది.
మోడీ మాటల తూటాలు
మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు, పాక్ హైకమిషన్ తో భేటీ విషయాలను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుని గుజరాత్ ప్రచార సభల్లో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతోంది. పాక్ హైకమిషనర్తో కాంగ్రెస్ నేతల రహస్య మంతనాలు అంటూ గుజరాత్ శాసన సభ ఎన్ననికల ప్రచారంలో ప్రదాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు మాటల తూటాలు పేల్చుతున్నారు.