సీబీఐ డైరెక్టర్ ఎంపికలో సీజేఐ రమణ ముద్ర- మోడీ ఛాయిస్కే చెక్- రేసులో ఏపీ ఐపీఎస్
సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం నిన్న ప్రధాని, విపక్ష నేత, ఛీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు ట్విస్ట్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్ రేసులో దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన ఈ ముగ్గురు సభ్యుల ప్యానెల్ చివరికి మూడు పేర్లను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఇందులో ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి కౌముదికి కూడా చోటు లభించింది. అయితే తుది జాబితా ఎంపికకు ముందు కేంద్రం సూచించిన పేర్లలో రెండింటికి జస్టిస్ ఎన్వీరమణ చెక్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
సీబీఐ డైరెక్టర్ ఎంపిక
ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ డైరెక్టర్గా ఉన్న ఆర్కే శుక్లా పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన స్ధానంలో తాత్కాలిక డైరెక్టర్గా అదనపు డైరెక్టర్గా ఉన్న ప్రవీణ్ సిన్హాను నియమించారు. ఈ నేపథ్యంలో తదుపరి సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం కసరత్తు మొదలైంది. ప్రధాని మోడీ, విపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి, సీజేఐ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో ఈ ప్యానెల్ దాదాపు 100కు పైగా పేర్లను గంటన్నర పాటు వడపోసింది. ఇందులో కేవలం ముగ్గురిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేశారు.
మోడీ సిఫార్సుకు సీజేఐ రమణ చెక్?
సీబీఐ డైరెక్టర్ రేసులో ఉన్న వంద మంది ఐపీఎస్ అధికారుల జాబితా నుంచి పేర్లను వడపోసే కార్యక్రమంలో ప్రధాని మోడీ కేంద్రం తరఫున సూచించిన ఇద్దరు అధికారులను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వద్దన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ అధికారిని రిటైర్మెంట్కు ఆరునెలలే ఉన్నందున పోలీస్ బాస్గా నియమించరాదన్న నిబంధన మేరకు తిరస్కరించారు.
ప్రస్తుతం బీఎస్ఎఫ్ డీజీగా పనిచేస్తున్నరాకేశ్ సిన్హా గతంలో సీబీఐ డైరెక్టర్గా పనిచేస్తూ అనర్హత వేటు ఎదుర్కొన్నారు. ఆయనతో పాటు ఎన్ఐఏ ఛీఫ్ వైసీ మోడీ ఈ నిబంధన కింద సీబీఐ డైరెక్టర్ రేసులో అనర్హులైనట్లు తెలుస్తోంది. జస్టిస్ రమణ అభ్యంతరానికి ప్యానెల్లో విపక్ష నేత అధిర్ చౌదరి కూడా మద్దతివ్వడంతో మెజారిటీతో వీగిపోయింది. ఈ రూల్ కింద కనీసం ఇద్దరు అధికారులు అనర్హులైనట్లు తెలుస్తోంది.
ఫైనల్ రేసులో ఏపీ ఐపీఎస్
సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని, విపక్షనేత, సీజేఐ ప్యానెల్ ముగ్గురుసభ్యులను అంతిమంగా ఎంపిక చేసింది. వీరిలో ఒకరు సీబీఐ డైరెక్టర్ అయ్యే అవకాశముంది. వీరిలో ఏపీ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న వీఎస్కే కౌముదికి చోటు దక్కింది. గతంలో విజయరామారావు, నాగేశ్వరరావు వంటి తెలుగురాష్ట్రాల ఐపీఎస్లు సీబీఐ డైరెక్టర్లుగా పనిచేశారు.
ఆయనతో పాటు మహారాష్ట్ర మాజీ డీజీపీ సుభోద్ కుమార్ జైశ్వాల్, సశస్త్ర సీమా బల్ డీజీగా ఉన్న కేఆర్ చంద్ర పేర్లు తుది జాబితాలో ఉన్నాయి. వీరిలో ఎవరికి అవకాశం దక్కనుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
కొత్త సీబీఐ డైరెక్టర్ ఆయనే?
సీబీఐ డైరెక్టర్ ఎంపికలో సీనియారిటీ, కేసుల దర్యాప్తులో అనుభవం, సమగ్రత వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసిన తుది జాబితాలో ఉన్న కౌముది, సుబోధ్ జైశ్వాల్, కేఆర్ చంద్రను పరిశీలిస్తే వీరిలో తదుపరి సీబీఐ డైరెక్టర్గా మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైశ్వాల్కే ఎక్కువగా అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్యానెల్లో ఉన్న విపక్షనేత అధిర్ రంజన్ చౌధురి పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయకున్నా.. ఎంపిక ప్రక్రియలో పేర్ల జాబితా, వడపోతపై కేంద్రం అనుసరించిన వైఖరిపై తన అసమ్మతిని నోట్ రూపంలో ఇచ్చారు.