చైనా మరో సంచలనం: 5జీ నెట్వర్క్ కోసం భారత సరిహద్దులో అక్రమ నిర్మాణాలు - సైనిక చర్యకు రావత్ సిగ్నల్
ఉత్తర తీరంలో అమెరికా నౌకలను బెదరగొట్టడానికి బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిన చైనా.. పశ్చిమ సరిహద్దులో ఇండియాతో సైతం కయ్యానికి కాలుదువ్వుతున్నది. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గొడవలు మొదలై నాలుగు నెలలు కావస్తున్నా.. ఉద్రిక్తతలు తగ్గలేదు. వివాదాల పరిష్కారం కోసం ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. డ్రాగన్ ఆగడాలు మరింతగా శృతిమించాయి. దీంతో సైనిక చర్యలకు వెనుకాడబోమని భారత్ సైతం హెచ్చరికలు జారీ చేసింది. తాజా వివాదం ఏంటంటే..
Recommended Video
అనూహ్యం: గాల్వాన్పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్పై అక్కసు
చైనా 5జీ నిర్మాణాలు..
ఎల్ఏసీ వెంబడి ఘర్షణలకు కేంద్ర బిందువైన తూర్పు లదాక్ లో చైనా తాజాగా అక్రమ నిర్మాణాలు చేపట్టింది. లదాక్ సమీపంలోని దేమ్చోక్ వద్ద చైనా 5జీ నెట్వర్క్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుతున్నది. ఆ క్రమంలో టవర్ల నిర్మాణం, తవ్వకాలను చేపట్టింది. ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గేలా, ఏప్రిల్ నాటి స్టేటస్ కో తిరిని నెలకొనేలా ఒక దిక్కు చర్చలు జరుపుతూనే, ఎల్ఏసీ వెంబడి చైనా 5జీ నెట్ వర్క్ పనుల్ని ఆగస్టు మొదటి వారం నుంచే ప్రారంభించినట్లు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ మేరకు రక్షణ శాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మరోవైపు..
ఫింగర్ 5 వద్ద భారీగా తవ్వకాలు
తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు.. రెండు దేశాలకు విభజన రేఖలా ఉందన్న సంగతి తెలిసిందే. గరిష్టంగా 5 కిలోమీటర్ల వెడల్పు, 604 కిలోమీటర్ల పొడవుండే ఈ సరస్సుకు ఉత్తర దిక్కున ఉండే పర్వతాలు కూడా సైనిక పరంగా కీలక పాయింట్స్ గా కొనసాగుతున్నాయి. చూడ్డానికి చేతివేళ్లలా కనిపించే ఆ పర్వతాలును ఫింగర్స్ అని కూడా అంటారు. ఫింగర్ 1 నుంచి ఫింగర్ 8 వరకూ మన భూభాగమే కాగా, ఫింగర్ 5 వరకున్న ప్రాంతాన్ని చైనా గతంలోనే ఆక్రమించుకుంది. ప్రస్తుతం ఫింగర్ 4 వద్ద రెండు వైపుల సైన్యాలు ఎదురెదురుగా తలపడే పరిస్థితి. కాగా, చైనా తాజాగా ఫింగర్ 5 ప్రాంతంలో కూడా 5జీ నెట్ వర్క్ కోసం చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టింది.
రాబోయే చలికాలంలోనూ వేడి తప్పదు..
తూర్పు లదాక్ లోని పలు ప్రాంతాల్లో మే మొదటి వారం నుంచి కవ్వింపులకు దిగుతోన్న చైనా.. ఓ వైపు చర్చల్లో పాల్గొంటూనే తన పని తాను చేసుకుపోతున్నది. రాబోయే చలికాలంలో కూడా అక్కడ వేడి తగ్గబోదనే సంకేతంగా.. దేమ్ చోక్, ఫింగర్ 5 వద్ద కొత్తగా చేపట్టిన నిర్మాణాల్లో పటిష్టమైన టెంట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. వేల అడుగుల ఎత్తులో విపరీత వాతావరణానికి తట్టుకునేలా చైనా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నది. చైనా బుద్ధి బాగా తెలిసిన భారత్ సైతం చలికాలంలోనూ సైనిక మోహరింపును కొనసాగించనున్నది. సాధారణంగా తూర్పు లదాక్ లో ఉండే సంఖ్యకు మూడు రెట్లు అదనంగా బలగాలను తరలించింది భారత్.
కొలిక్కిరాని చర్చలు..
ఎల్ఏసీ వెంబడి సాధారణ పరిస్థితులు నెలకొనేలా రెండు దేశాల మధ్య.. సైనిక, దౌత్య మార్గాల్లో ఇప్పటికే పలు దశల చర్చలు జరిగాయి. ప్రతి దఫా చర్చల్లో.. ‘‘సానుకూలంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం'' లాంటి అతి సాధారణ ప్రకటనలు మినహా క్షేత్రస్థాయిలో బలగాల ఉపసంహరణ దిశగా ఎలాంటి అడుగు పడలేదు. గాల్వాన్ లోయలోని 15వ పెట్రోలింగ్ పాయింట్, పాంగాంగ్ సరస్సు, 17వ పెట్రోలింగ్ పాయింట్ కిందికి వచ్చే గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి వైదొలుగుతానని చర్చల్లో అంగీకరించిన చైనా.. వాస్తవంలో అక్కణ్నుంచి ఇంచు కూడా కదల్లేదు. ఇటు ఫింగర్ పాయిట్స్ పైనా మెలిక ప్రకటనలు చేస్తూ వస్తోంది. ‘‘ముందు మీరు ఫింగర్ 3 వరకు వెనక్కెళితే.. ఆ తర్వాత చర్చలను బట్టి మేం కూడా వెనక్కి తగ్గడంపై ఆలోచిస్తాం''అని చర్చల్లో చైనా అధికారులు చేస్తోన్న ప్రతిపాదనల్ని భారత్ తిరస్కిరిస్తున్నది. మొత్తంగా సైనిక, దౌత్య మార్గాల్లో జరుగుతున్న చర్చలు ఎంతకీ కొలిక్కి రావడంలేదు. వచ్చే వారం మరో దశ చర్చలు ఉండొచ్చని తెలుస్తోంది.
చైనాపై సైనిక చర్యకు సై..
చైనా కవ్వంపులు మొదలై సెప్టెంబర్ 5 నాటికి నాలుగు నెలలు పూర్తవుతుంది. ఈ గడువు మొత్తంలో చైనా దూకుడు స్వభావమే ప్రదర్శించింది తప్ప భారత్ లాగా శాంతి కోసం ముందడుగు వేయనేలేదు. జూన్ 15నాటి గాల్వాన్ ఘర్షణలో మన జవాన్లు 20 మందిని డ్రాగన్ పొట్టనపెట్టుకుంది. ఆ తర్వాత కూడా సైనిక, దౌత్య మార్గాలు చర్చలు జరిగాయి, కేంద్రం ప్రత్యేక ప్రతినిధిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడారు. అయినా పరిస్థితిలో ఎంతకీ మార్పు రావడంలేదు ఈ నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చర్చల ద్వారా చైనా తీరు మారనట్లయితే సైనిక చర్యకు సైతం వెనుకాడబోమని రావత్ హెచ్చరించారు.
చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్కు సమీపంగా