తమిళ అసెంబ్లీ తీరును ఛీత్కరించిన కమల్ సహా సినీ ప్రముఖులు
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘటనలపై సినీ ప్రముఖులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్షంగా పన్నీరు సెల్వంకు మద్దతు ప్రకటించారు,
చెన్నై: తమిళనాడు శానససభలో శనివారంనాడు జరిగిన విధ్వంసంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయని ఆ ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తమిళనాడుకు మరో ముఖ్యమంత్రి వచ్చేలా ఉన్నారని కమల్ ట్విట్టర్ ద్వారా అన్నారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ప్రజలు సరైన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పన్నీరు సెల్వంకు కమల్ హాసన్ పరోక్షంగా మద్దతు పలికారు. బలపరీక్ష, జరిగిన తీరుపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బలపరీక్షపై గవర్నర్కు తమ గళాన్ని వినిపిస్తూ ఈమెయిళ్లు పంపించాలని కోరారు.
ఈ మెయిళ్ల ద్వారా హుందా, అసభ్యత లేకుండా చక్కని భాషతో తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచిస్తూ గవర్నర్ ఈమెయిల్ ఐడి ([email protected])ని ట్వీట్ చేశారు.
మరోసారి ఎన్నికలు నిర్వహించాలని మరో నటుడు అరవింద స్వామి డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితిలో రీఎలక్షన్ ఒక్కటే మార్గమని, బలపరీక్ష ప్రజాతీర్పును ప్రతిబింబించడం లేదని ఆయన అన్నారు.
బలపరీక్ష తీరును సినీ నటి గౌతమి ఖండించారు. పళని స్వామి బృందం తీరును ఆమె ఖండించారు. అంకెల గారడీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని వంచించలేరని, ఇది ప్రజల చేత ప్రజల కోసం ప్రజాస్వామ్యమని, అది కొనసాగుతుందని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ముఖ్యమంత్రి ఓపిఎస్సే కావాలంటూ ఆమె యాష్ ట్యాగ్ జోడించారు.
ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైన ప్రతిపక్షం లేకుండా విశ్వాస పరీక్ష ఏంటంటూ నటి కుష్బూ ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని నటి రాధిక కోరారు. ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్ రంగంలోకి దిగి చర్య తీసుకోవాలని రాధిక అన్నారు. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ బలపరీక్షను ఎవరూ అంగీకరించబోరని అన్నారు.