చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ: 'ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసుల్లో ఛార్జిషీట్ దాఖలుకు 10 నుంచి 15 ఏళ్లా?' - ప్రెస్ రివ్యూ

సుప్రీంకోర్టు

ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసుల్లో తీవ్ర జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని ఈనాడు ఒక కథనం రాసింది.

దాని ప్రకారం.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేస్తున్నా వాటికి ఎప్పటికీ ముగింపు ఉండటం లేదని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇందుకోసం అవసరమైన వనరులు, ఇతర సదుపాయాలు కల్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.

ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసులను త్వరగా విచారించాలని, నేరం రుజువైతే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ నాయకుడు అశ్విన్ ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతోంది.

'దర్యాప్తులో ఏమైనా ఉందని తేలితే వెంటనే ఛార్జిషీట్ దాఖలు చేయండి. నిందితుల తలపై కత్తి వేలాయదీయొద్దు. ఏవైనా తప్పులుంటే వెంటనే విచారణ వేగవంతం చేయండి' అని జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు.

కోర్టుల్లో 200లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 10, 15 ఏళ్లు దాటినా అభియోగపత్రాలు దాఖలు చేయకపోవడంపై కారణాలు చెప్పడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు

నాలుగేళ్ల క్రితం నాటి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నటులు రానా దగ్గుబాటి, రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సహా పది మంది సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నించనుందని ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది.

దాని ప్రకారం... డ్రగ్స్‌ క్రయ విక్రయాల్లో భారీగా మనీలాండరింగ్‌ జరిగిందనే సమాచారం మేరకు ఈడీ రంగంలోకి దిగింది. ఎక్సైజ్‌ శాఖ నుంచి వివరాలు సేకరించి సినీ ప్రముఖులు సహా మొత్తం 12 మందికి బుధవారం నోటీసులు జారీ చేసింది.

వీరిలో సినీ నటులు రకుల్‌, రానా, రవితేజ పూరీతో పాటు చార్మీ కౌర్‌, నవదీప్‌, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌, నందు, తరుణ్‌ ఉన్నారు. రవితేజ కారు డ్రైవర్‌ శ్రీనివాస్‌, మరొకరు ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌కు నోటీసులు ఇచ్చారు.

ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 22 వరకు నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

అయితే ఈ కేసులో రకుల్‌, రానా, రవితేజ, పూరీని నిందితులుగా చేర్చలేదని, మనీలాండరింగ్‌లో వీరి ప్రమేయం ఉందని చెప్పడం తొందరపాటే అవుతుందని ఈడీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఆగస్టు 30న పూరీ, సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్‌, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ , 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

ఇళ్లకు పావలా వడ్డీకి రుణాలు - జగన్

ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులైన పేదలకు పావలా వడ్డీ కింద రుణాలు ఇప్పించేలా బ్యాంకర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారని సాక్షి పత్రిక ఒక కథనం ప్రచురించింది.

దాని ప్రకారం.. ఇళ్ల స్థలాల పంపిణీ, గృహ నిర్మాణంతో పాటు ఖరీఫ్‌ సన్నద్ధత, వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష, పరిశ్రమలపై ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

లబ్ధిదారులకు పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్‌ చేశామని, అత్యవసర సమయాల్లో వీటి మీద రుణం తెచ్చుకునేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

పావలా వడ్డీ మాత్రమే లబ్ధిదారుడికి పడుతుందని, మిగతా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు.

రుణ సదుపాయం వల్ల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మరింత ఊపందుకుంటుందన్నారు.

కొన్ని జిల్లాల్లో సెర్ప్, మెప్మా సహకారంతో లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారని తెలిపారు.

హౌసింగ్‌ లే అవుట్లలో లబ్ధిదారుల ప్లాట్ల మ్యాపింగ్‌ 10 రోజుల్లోగా పూర్తిచేయాలని జగన్ ఆదేశించారు. దీనివల్ల అర్హులైన వారికి మిగిలిన ప్లాట్లను వెంటనే కేటాయించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

తల వెంట్రుకల స్మగ్లింగ్ వెనక చైనా దందా

తల వెంట్రుకల స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ దందా బయటపడిందని వెలుగు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

వెంట్రుకల ఎక్స్‌పోర్ట్‌లో అండర్ ఇన్‌వాయిస్ కింద స్మగ్లింగ్ జరుగుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ - ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో వెంట్రుకల స్మగ్లింగ్ తీగ లాగుతున్న ఈడీకి చైనా బెట్టింగ్ యాప్స్ లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇండియాలో జరుగుతున్న హవాలా గుట్టు బయటపడింది.

ఇందులో భాగంగానే మంగళవారం హైదరాబాద్‌తో పాటు ఈస్ట్ గోదావరి, గుంటూరులోని తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. వికాస్ ఎంటర్ ప్రైజెస్, నరేష్ హెయిర్ ఎక్స్‌పోర్టర్, హృతిక్ ఎగ్జిమ్ సహా మరో ఆరు కంపెనీలపై దాడులు చేసింది.

హెయిర్ ఎక్స్‌పోర్ట్ వ్యాపారి నుంచి 2.90 కోట్ల నగదు, 12 ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు కంప్యూటర్లు ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో మనీలాండరింగ్, హవాలా జరిగినట్లు ఆధారాలు సేకరించింది. ఇండియాలో కొంటున్న వెంట్రుకలకు తక్కువ విలువ చూపుతూ విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది.

చైనీస్ ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు 16కోట్ల వరకు హవాలా లావాదేవీలను గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+