సుప్రీం ఛీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ- కేంద్రానికి సీజేఐ బాబ్డే సిఫార్సు- ఆమోదం లాంఛనమే
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏపీకి చెందిన జస్టిస్ ఎన్వీరమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రమణ పేరును ప్రస్తుత సీజేఐ బాబ్డే కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఆయన ప్రతిపాదన పంపారు. దీన్ని న్యాయశాఖ పరిశీలించి సుప్రీంకోర్టు కొలీజియానికి పంపనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే జస్టిస్ ఎన్వీరమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత సీజేఐ బాబ్డే పదవీకాలం వచ్చే నెల 23తో ముగియనుంది.
సుప్రీం ఛీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఏపీకి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రమణ సీనియార్టీ ప్రకారం ప్రస్తుత సీజే బాబ్డే తర్వాత స్ధానంలో ఉన్నారు. దీంతో నిబంధనల ప్రకారం ఆయనకే అవకాశం దక్కాల్సి ఉంది. ఇందుకు సీజేఐ బాబ్డే కూడా అంగీకారం తెలపడంతో జస్టిస్ ఎన్వీ రమణకు అత్యున్నత పదవి లభించే అవకాశం లభించింది. ప్రస్తుత సీజే జస్టిస్ బాబ్డే వచ్చే నెల 23న రిటైర్ అయ్యాక రమణ ఆ స్ధానంలోకి రానున్నారు.
తన వారసుడిగా జస్టిస్ రమణ పేరు సూచించిన సీజేఐ
ప్రస్తుత ఛీప్ జస్టిస్ శరద్ బాబ్డే రిటైర్మెంట్కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన వారసుడి పేరును సూచించాలని కేంద్రం కోరింది. దీంతో జస్టిస్ బాబ్డే ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ పేరును సిఫార్సు చేశారు. ఈ మేరకు న్యాయశాఖకు ఆయన లేఖ రాశారు. దీన్ని న్యాయశాఖ పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సుప్రీంకోర్టు కొలీజియానికి పంపబోతోంది. అనంతరం సుప్రీంకోర్టు కొలీజియం కూడా ఆమోదముద్ర వేస్తే ఇక తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ బాధ్యతలు చేపట్టడం ఖాయం అవుతుంది.
సుదీర్ఘ అనుభవం కలిగిన జస్టిస్ రమణ
తదుపరి సీజేఐగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే సిఫార్సు అందుకున్న జస్టిస్ రమణకు న్యాయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, బార్ కౌన్సిళ్ల ఛైర్మన్గా, జ్యుడిషియల్ కమిషన్లోనూ పనిచేసిన అనుభవం జస్టిస్ రమణ సొంతం. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణను ఎంపిక చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.2000 సంవత్సరంలో ఏపీ హైకోర్టు శాశ్వత జడ్డిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ, అనంతరం కొంతకాలం ఇదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం దక్కింది. 2014లో జస్టిస్ రమణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం దక్కింది. ఇప్పుడు ఏకంగా అత్యున్నత పదవి అయిన భారత ప్రధాన న్యాయమూర్తి పదవి లభించబోతోంది. వచ్చే నెల 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు వరకూ 16 నెలల పాటు ఆ పదవిలో ఉంటారు.
కోకా సుబ్బారావు తర్వాత రెండో తెలుగోడు
సుప్రీంకోర్టు చరిత్రలో పలువురు తెలుగు న్యాయమూర్తులు పనిచేసినా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం మాత్రం ఇద్దరికే లభించింది. అందులోఏపీకి చెందిన కోకా సుబ్బారావు తొలి తెలుగు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1966-67 మధ్య సీజేగా పనిచేసిన కోకా సుబ్బారావు తొలి తెలుగు సీజేగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం ఇన్నాళ్లకు జస్టిస్ రమణకు అవకాశం దక్కింది.ఏపీలోని కృష్ణాజిల్లా పొన్నవరానికి చెందిన జస్టిస్ రమణ కొంతకాలం ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. ఇన్నాళ్లకు మరో తెలుగు వ్యక్తికి భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం లభించడంతో న్యాయవర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.