అన్నింటినీ మౌనంగానే భరించాం - ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా: మర్చిపోలేను - సీజేఐ ఎన్వీ రమణ..!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ముగిసింది. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు వీడ్కోలు పలికారు. 16 నెలల పాటు ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పని చేసారు. పదవీ విరమణ నాడు జస్టిస్ ఎన్వీ రమణ తన బాల్యం నుంచి ఎదుర్కొన్న కష్టాలు.. న్యాయవాదిగా - న్యాయమూర్తిగా ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్ని ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఒక సమయంలో ఆయన ఉద్వేగానికి గురయ్యారు. తాను మట్టిరోడ్లు మాత్రమే ఉన్న సాధారణ గ్రామంలో జన్మించానని చెప్పుకొచ్చారు.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు
తనకు 12 ఏళ్ల వయసులో తొలి సారి కరెంట్ ను చూసానని చెప్పారు. 17 ఏళ్ల వయసులోనే విద్యార్ది సంఘ నాయకుడిగా పని చేసానని వివరించారు. ఎమర్జెన్సీ కారణంగా ఒక విద్యా సంవత్సరం కోల్పోయాయనని చెప్పారు. వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కార్యనిర్వాహక, పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థల మధ్య సమతూకం పాటిస్తూ తన న్యాయమూర్తి పాత్ర పోషించానన్నారు. న్యాయవాద వృత్తి అందరూ భావించినట్లుగా సులభతరం కాదన్నారు. తాను న్యాయమూర్తిగా ఎదుర్కొన్న ఒత్తిడిని వివరించారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కేసుల పరిష్కారంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. న్యాయస్థానాల్లో మౌళిక వసతుల కల్పను ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

మౌనంగానే అన్నింటినీ భరించా
తాను సీజేఐ గా ఉన్న సమయంలో 255 మంది న్యాయమూర్తుల నియామకం జరిగిందన్నారు. తాను ఈ స్థాయికి రావటం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయన్నారు. విమర్శలు..ప్రశంసలు సమానంగా తీసుకుంటేనే జీవితంలో రాణిస్తామననారు. తన న్యాయవాద జీవితం సవాళ్లతోనే గడిచిందని వివరించారు. తన ప్రతీ కష్టంలో తన సతీమణి గోడలా అండగా నిలిచారని ప్రశంసించారు. తన కుమార్తులు..అల్లుళ్లు, తన మనవళ్లు తనను చూసుకుంటారని..తనకు రిటైర్ అవుతున్న బాధ అక్కర్లేదని చెప్పుకొచ్చారు. న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఎదురైన సవాళ్ల వేళ..తనతో పాటుగా కుటుంబం మౌనంగా ఆవేదన భరించిందని.. సత్యమేవ జయతే అని నినాదం నిజమైందన్నారు. తాను ఒక గొప్ప న్యాయమూర్తిని కాకపోవచ్చు కానీ, న్యాయం చేయటానికి ప్రయత్నం చేశానని వివరించారు. తాను న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినా.. రాజ్యంగ బద్దంగానే వ్యవహరిస్తానని స్పష్టం చేసారు. గురజాడ అప్పారావు సూక్తులను జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేసారు.

సీనియర్ న్యాయవాది కన్నీటి పర్యంతం
ప్రధాన న్యాయమూర్తిగా నా పదవీకాలమైన గత 16 నెలల్లో 50 రోజులు మాత్రమే పూర్తిస్థాయి విచారణలు జరగడం బాధాకరన్నారు. ప్రధాన న్యాయమూర్తులు వస్తారు, వెళతారు కానీ సుప్రీంకోర్టు శాశ్వతం. ప్రతిఒక్కరూ ఈ వ్యవస్థకు ఎంతో కొంత తమ భాగస్వామ్యాన్ని అందిస్తారని చెప్పారు. ఇక, ఈ సీనియర్ న్యాయవాది జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంలో ధుష్యంత్ దవే.. జస్టిస్ రమణ సేవలను కొనియాడారు. ఆయన తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారు. జస్టిస్ రమణ ప్రజల న్యాయమూర్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. జస్టిస్ రమణ పదవీవిరమణ న్యాయవ్యవస్థకు తీరని లోటు అని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు. తనకు సహకారం అందించిన సహచర న్యాయమూర్తులకు..సిబ్బందికి జస్టిస్ ఎన్వీ రమణ అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications