అల్లర్లు తగ్గాకే కేసును విచారణ చేస్తాం: జామియా ఆందోళన కేసుపై చీఫ్ జస్టిస్
Recommended Video
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో చోటు చేసుకున్న హింసపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. కేసును విచారణ చేసిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే... హింస తగ్గితేనే తాను కేసును విచారణ చేస్తానని చెప్పారు. హక్కుల గురించి న్యాయస్థానంకు తెలుసునని అదే సమయంలో హింసాత్మక వాతావరణంలో తాను కేసును విచారణ చేయాలేనని చెప్పారు. ఈ హింస అంతా తగ్గాలని తగ్గాకే కోర్టు సుమోటోగా స్వీకరిస్తుందని చెప్పారు. హక్కులు శాంతియుత నిరసనలకు న్యాయస్థానం వ్యతిరేకం కాదని జస్టిస్ బోబ్డే చెప్పారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చింది..ఇప్పుడేమో శివసేన కొత్త పల్లవి అందుకుంది
విద్యార్థులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు
కేసును సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ కోర్టును కోరారు. దేశవ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేసిన జస్టిస్ బోబ్డే... విద్యార్థులు అయినంత మాత్రాన వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరని చెప్పారు. పరిస్థితులు చల్లబడ్డాకే దీనిపై విచారణ చేపడతామని చెప్పారు. ఇలాంటి హింసాత్మక పరిస్థితుల్లో కేసును విచారణ చేసి ఒక నిర్ణయానికి రాలేమని జస్టిస్ బోబ్డే అభిప్రాయపడ్డారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే కేసును టేకప్ చేస్తామని చెప్పారు.
అల్లర్లు ఆగాకే కేసును విచారణ చేస్తాం
ఇక కేసును వాదించిన మరో సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొన్సాల్వేస్ విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని చెప్పగా వీడియోలను ఇప్పుడు పరిశీలించలేమని చెప్పారు. హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కొనసాగితే కేసును విచారణ చేయలేమని చెప్పారు. మంగళవారం కేసును న్యాయస్థానం విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థులపై పోలీసుల చర్యలను తప్పుబడుతూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇది అర్జెంటుగా వినాల్సిన కేసు కాదని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్ మరియు జస్టిస్ సి హరిశంకర్ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో మిన్నంటిన ఆందోళనలు.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం
ఇక పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాలు పలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశాయి. నాలుగు బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.ఇందులో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇద్దరు ఫైర్ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళనలు చేసిన సమయంలో హింస చోటుచేసుకుంది. అయితే విద్యార్థులు ఎలాంటి హింసకు పాల్పడలేదని విద్యార్థి నాయకులు చెబుతున్నారు. హింస చెలరేగగానే జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్లోకి పోలీసులు బలవంతంగా వచ్చి స్టాఫ్పై చేయిచేసుకున్నారని యూనివర్శిటీ చీఫ్ ప్రాక్టర్ వసీం అహ్మద్ ఖాన్ చెప్పారు.