ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : ఉదయం నుంచి ఒడిదుడుకుల్లో.. చివరికి లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
ముంబై: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లోకి జంప్ చేశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకులుగా సాగిన మార్కెట్లు, కొనుగోళ్ల జోరుతో చివరికి మంచి లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 194 పాయింట్లు జంప్ చేసి, 33,247 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 10,252 వద్ద క్లోజయ్యాయి. గురువారం రెండో దశ గుజరాత్ పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.
మదుపర్లు ఈ ఎగ్జిట్ పోల్స్పై ఎక్కువగా దృష్టిసారించారు. అమెరికా ఫెడ్ పావు శాతం వడ్డీ పెంచడంతోపాటు జీడీపీ 2.5 శాతం వృద్ధి చూపనున్నట్లు పేర్కొనడంతో దేశీయ మార్కెట్లు తొలుత లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఆపై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలుమార్లు హెచ్చుతగ్గులను చవిచూశాయి. మీడియా మినహా అన్ని రంగాల షేర్లు లాభపడగా.. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ 0.7 శాతం స్థాయిలో పుంజుకున్నాయి.
నిఫ్టీ దిగ్గజాలలో హెచ్పీసీఎల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, ఐవోసీ, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, ఎంఅండ్ఎం, బీపీసీఎల్, యాక్సిస్ 3.3-1.3 శాతం మధ్య పైకి ఎగిశాయి. అయితే టీసీఎస్, యూపీఎల్, గెయిల్, అరబిందో, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ 2.7-0.5 శాతం మధ్య నీరసించాయి.