రెండోసారి మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తొలి సంతకం ఆ చెక్కుపైనే
ముంబై: అనూహ్య మలుపుల మధ్య శనివారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన దేవేందర్ ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఓ చెక్కుపై చేశారు. ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయానికి సోమవారం సీఎం ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

రెండోసారి సీఎంగా ఫడ్నవీస్ తొలి సంతకం..
ఓ వైపు మహారాష్ట్రలో రాజకీయాలు కొనసాగుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రిగా తన పని మొదలుపెట్టారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ముఖ్యమంత్రి సహాయ నిధికి చెందిన ఓ చెక్కుపై సీఎం ఫడ్నవీస్ తొలి సంతకం చేశారు. ఆ చెక్కును ఓ పేద మహిళకు అందజేశారు. కుసుమ్ వెంగుల్కర్ అనే మహిళకు ఆ చెక్కును అందించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్లో వెల్లడించారు.
కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం..
సుప్రీంకోర్టు 80 నిమిషాలపాటు వాదనలు విన్న అనంతరం మంగళవారానికి తీర్పును వాయిదా వేసింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సోమవారం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం యథావిధిగా కొనసాగుతోంది.

మహా ట్విస్టిచ్చారు..
శనివారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్సీపీ లేజిస్లేచర్ పార్టీ నేతగా అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో గవర్నర్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

శుక్రవారం రాత్రి వరకు అలా..
శుక్రవారం రాత్రి వరకు శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకుంటుండగా అజిత్ పవార్ ఎన్సీపీతోపాటు శివసేన, కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చారు. అయితే, శనివారం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో శరద్ పవార్ శివసేన నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. 170 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉద్ధవ్ థాక్రే కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు శరద్ పవార్.

తీర్పు వాయిదా వేసిన కోర్టు..
54 మంది ఎన్సీపీ సభ్యుల మద్దతుతో అజిత్ పవార్ ముందుకు రావడంతో 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారని కేంద్రం సుప్రీంకోర్టులో తెలిపింది. తక్షణమే మహారాష్ట్రలో బల నిరూపణ పరీక్ష పెట్టాలని, తమ వద్ద 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పత్రాలను సమర్పించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. మంగళవారానికి వాయిదా వేసింది. 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం నిలుపుకోవాలంటే బీజేపీ 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.












Click it and Unblock the Notifications