రాష్ట్ర అభివృద్ధిపై నేను సంతృప్తిగా లేను! మరో రోజులో తెలిసిపోతుంది: సిద్ధరామయ్య
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రమాణ స్వీకారం చేసి అయిదేళ్లు పూర్తి చేసుకుంది. మే 13వ తేదీకి అయిదేళ్లవుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తాను 13 మే 2013న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని, సీఎంగా అయిదేళ్లు పూర్తయ్యాయని, ఈ అయిదేళ్లలో చాలా నేర్చుకున్నానని, కావల్సినంత రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకున్నానని చెప్పారు. రాష్ట్రానికి నా సామర్థ్యం మేరకు మంచి పనులు చేశానన్నారు.
సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు నేనేం చేయాలనుకున్నానో దాదాపుగా అన్నీ చేశానని, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చాననే అనుకుంటున్నానని, ఇదంతా ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. ఇకపై కూడా ప్రజలు తనపై ఇదే నమ్మకాన్ని ఉంచుతారని విశ్వసిస్తున్నానని చెప్పారు.
ఎప్పటికీ నాది ఒకటే మాట అని, రాష్ట్రాభివృద్ధి పట్ల తాను సంతృప్తిగా లేనని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో బాటలో ఇంకా పరుగులు పెట్టించే దిశగా పని చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నానని, మరో రోజు వేచి చూస్తే తెలిసిపోతుందన్నారు.