స్కూల్ పిల్లలపై విజయ్ ఫోకస్! బ్రేక్ ఫాస్ట్ పథకంలో బిగ్ చేంజ్..
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని’ (Chief Minister's Breakfast Scheme) ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా విస్తరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రాథమిక పాఠశాల పిల్లలకు మాత్రమే అందుతున్న ఈ ఉచిత అల్పాహారాన్ని, ఇకపై 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా అందించనున్నారు. సామాజిక సంస్కర్త 'పెరియార్’ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ నుండి ఈ విస్తరణ అమలుల్లోకి రానుంది.
సంక్షేమ పథకాల్లో జాప్యం వద్దు.. సీఎం విజయ్ సీరియస్
ముఖ్యమంత్రి విజయ్ సోమవారం సచివాలయంలో సామాజిక సంక్షేమ - మహిళా సాధికారత శాఖ కార్యకలాపాలపై సుదీర్ఘ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సమావేశంలో మహిళలు, పిల్లలు, ట్రాన్స్జెండర్లు, వృద్ధుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకమైనా అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, అత్యంత వేగంగా చేరాలని సీఎం విజయ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాలల రక్షణపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలని, పిల్లలు మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఇప్పటికే డ్రగ్స్ అలవాట్లకు బానిసలైన పిల్లలు ఉంటే, వారిని గుర్తించి రక్షించడంతో పాటు వారికి తగిన వైద్యం అందించి పునరావాసం కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పటిష్టమైన రాష్ట్రాలతోనే 'వికసిత్ భారత్' సాధ్యం: నీతి ఆయోగ్ భేటీలో సీఎం
మరోవైపు, దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం విజయ్ తనదైన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించారు. రాష్ట్రాల సాధికారత, కేంద్రం నుంచి తగిన ఆర్థిక మద్దతు, సహకారం, సమాఖ్య స్ఫూర్తి (Cooperative Federalism) ఉంటేనే దేశం ముందుకు వెళ్తుందని ఆయన పిలుపునిచ్చారు.
సమగ్ర అభివృద్ధి, బలీయమైన రాష్ట్రాల ద్వారా మాత్రమే 'వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యాన్ని సాధించగలమని విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను కాపాడుకుంటూనే.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి అత్యంత నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ సమక్షంలోనే విజయ్ తేల్చి చెప్పారు.
2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే టార్గెట్!
భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న తమిళనాడు వృద్ధి రేటుపై సీఎం విజయ్ భవిష్యత్తు ప్రణాళికను నీతి ఆయోగ్ భేటీలో చాటిచెప్పారు. రాబోయే 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల (1.5 Trillion Dollars) మహా ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఈ భారీ ఆర్థిక వృద్ధి ద్వారా, 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే జాతీయ విజన్కు తమిళనాడు తన వంతు సింహభాగాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి విజయ్ ధీమా వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications