ఢిల్లీ పోలీసులకు బిగ్ షాక్.. సీజేపీ సంచలన ప్రకటన!
జూలై 20న ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసుల చర్య విద్యార్థులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించడంతో విద్యార్థులు గాయపడ్డారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ పేపర్ లీక్ అంశాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి దిగడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన నిరసనకారుల ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేసే ఓ కొత్త వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసు సిబ్బంది ఫోటోలు కూడా అందులో ఉంటాయన్నారు.
ఈ నిరసనలో పోలీసుల దాడి కారణంగా పలువురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయని సౌరవ్ దాస్ వెల్లడించారు. అంతే కాకుండా పలువురు మహిళలు, యువతులపై కూడా పోలీసులు దౌర్జన్యానికి దిగారని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. "మేము అన్యాయాన్ని మౌనంగా చూస్తూ కూర్చోం. గాయపరచడం, తలలు పగలగొట్టడం లేదా అవయవాలు విరగ్గొట్టడంలో ప్రమేయం ఉన్న పోలీసు అధికారుల ప్రతి ఒక్క ఫోటోను సేకరించి వారిని బాధ్యులను చేస్తాం" అని సౌరవ్ దాస్ హెచ్చరించారు.

చాలా కేసులలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయచేయడానికి నిరాకరించారని .. అటువంటి కేసులలో స్వయంగా తామే ఫిర్యాదు చేస్తామని.. పోలీసులు వాటిని పట్టించుకోకపోతే, కోర్టును ఆశ్రయిస్తామని సీజేపీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల నుండి తమకు మద్దతు లభిస్తోందని కూడా వారు పేర్కొన్నారు.
వెబ్సైట్లో ఏముంటుంది?
గాయపడిన ఏ విద్యార్థి అయినా తమ ఫోటోలు, వీడియోలు, వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చు. సీజేపీ బృందం వాటిని పరిశీలించి, పోలీసులను గుర్తించి వారిపై ఫిర్యాదును సిద్ధం చేస్తుంది.శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇష్టానుసారంగా వ్యవహరించారని.. వారందరినీ చట్టం ముందు నిలబెట్టి కటకటాల వెనక్కి పంపేవరకు పోరాడతామని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ లాఠీఛార్జ్ ఘటనపై సుప్రీంకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణ జులై 27న సుప్రీంకోర్టులో జరగనుంది.












Click it and Unblock the Notifications