Gujarat : గుజరాత్ బీజేపీలో అసంతృప్తుల పోరు-38 మందికి టికెట్ల నిరాకరణతో-కాంగ్రెస్ హ్యాపీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దెదించేందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలని విపక్ష కాంగ్రెస్, ఆప్ భావిస్తున్నాయి. ఈ పోరులో ఆప్ జోరుతో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. తాజాగా బీజేపీలో నెలకొన్న అసంతృప్తుల పోరు సంతోషం నింపుతోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్ లో టికెట్ల నిరాకరణతో అసంతృప్తుల పోరు కనిపిస్తుండగా.. ఇప్పుడు అధికార బీజేపీపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ 38 మంది సిట్టింగ్ లకు అసెంబ్లీ టికెట్లు నిరాకరించింది. ఇందులో చాలా మంది సీనియర్ నేతలున్నారు. అలాగే వీరంతా గత ఎన్నికలుగా భారీ మెజారిటీతో గెలుస్తున్నవారే. దీంతో ఈసారి వీరు టికెట్లు రాకపోవడంతో అసమ్మతి శిబిరాలు నడుపుతున్నారు. తమ స్ధానంలో బీజేపీ నిలబెట్టిన అభ్యర్దుల్ని ఓడించేందుకు పలు చోట్ల స్వతంత్ర అభ్యర్ధులుగా లేదా రెబెల్ అభ్యర్ధులుగా బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్దులకూ, రెబెల్స్ కు మధ్య పోరును సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారికి బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. దీంతో స్ధానిక నాయకత్వంలో అసంతృప్తి పెరుగుతోంది.అదే సమయంలో టికెట్లు రాని వారు సైతం రెబెల్స్ గా బరిలోకి దిగి బీజేపీపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ పరిణామాల్ని సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమ పార్టీలో టికెట్లు వారి నుంచి ఒత్తిడి ఉన్నా వారిని తాము బుజ్జగిస్తున్నామని, కానీ బీజేపీ మాత్రం కేంద్రం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా వారిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
తాజాగా గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనపై అక్కడి హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం, వ విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం, సిట్ విచారణ డాక్యుమెంట్లు కోరడం వంటి అంశాల్ని కాంగ్రెస్ పార్టీ హైలెట్ చేస్తోంది. గుజరాత్ లో ప్రస్తుతం ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా ఉందని, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ చెబుతున్న గుజరాత్ మోడల్ అభివృద్ధి ఫెయిల్యూర్ అని ఆరోపిస్తోంది. తాజా పరిణామాల్ని కాంగ్రెస్ ఎంత సొమ్ముచేసుకుంటుందన్నదానిపై ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.