అధిష్టానం కొరడా: ఆరుగురు రెబెల్ ఎంపీల బహిష్కరణ
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధిష్టానం ఎట్టకేలకు ఆరుగురు తిరుగుబాటు పార్లమెంటు సభ్యులపై కొరడా ఝళిపించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో పాటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న ఆరుగురు లోకసభ సభ్యులపై కాంగ్రెసు అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సబ్బం హరి, హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్లను కాంగ్రెసు అధిష్టానం బహిష్కరించింది. దాంతో వారు కాంగ్రెసు సభ్యులు కాకుండా పోతారు. తమను పార్టీ నుంచి మాత్రమే బహిష్కరించారని, పార్లమెంటు సభ్యులుగా కాదని రాయపాటి సాంబశివ రావు అన్నారు. లోకసభలో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఆయన అన్నారు. తాము అన్నింటికీ సిద్ధపడి ఉన్నట్లు తెలిపారు.
వారిని బహిష్కరించడం ద్వారా లోకసభలో తెలంగాణ బిల్లుకు ఆటంకం కలగకుండా చూసుకునే వ్యూహంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానానికి నోటీసు ఇవ్వడాన్ని కాంగ్రెసు అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. లోకసభలో ఆందోళనకు దిగితే స్పీకర్ మీరా కుమార్ తనకున్న విస్తృతాధికారాల ద్వారా సస్పెండ్ చేసి, సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం.
పార్టీ నుంచి బహిష్కరణకు గురి అయినప్పటికీ లోకసభ సభ్యులుగా వారు కొనసాగుతారు కాబట్టి సభ సజావుగా నడవడానికి వారిని సభ నుంచి కూడా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితే ఉండవచ్చునని అంటున్నారు. తన ఎంపిలను అదుపు చేయలేని స్థితిలో కాంగ్రెసు ఉందని బిజెపి విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానం వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి బహిష్కరణకు గురి అయినప్పటికీ తమకు ఏ విధమైన ఇబ్బంది లేదని, తాము అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చి హక్కులను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి స్పీకర్ తమను సభ నుంచి సస్పెండ్ చేయలేరని లగడపాటి రాజగోపాల్ అంటున్నట్లు తెలుస్తోంది.
ఆరుగురు పార్లమెంటు సభ్యులపై వేటు వేసిన విషయాన్ని ఎఐసిసి పిసిసికి తెలియజేసింది. ఆరుగురు ఎంపీలపై వేసిన బహిష్కరణ వేటు వెంటనే అమల్లోకి వస్తుందని ఎఐసిసి నేత జనార్దన్ ద్వివేది తెలిపారు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణపై ఎఐసిసి వారిని బహిష్కరించింది.