ఢిల్లీని వీడనున్న సోనియా గాంధీ..!!
బెంగళూరు: అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అధ్యక్ష ఎన్నికల సందడి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇక గాంధీయేతర కుటుంబ నేత చేతుల్లోకి వెళ్లడం ఖాయమైంది. కాంగ్రెస్లో ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడానికి ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మల్లికార్జున ఖర్గె, శశిథరూర్ బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వారిద్దరే ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు.

జోరుగా జోడో యాత్ర..
మరోవంక- రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతుంది. ఇటీవలే కర్ణాటకలో ప్రవేశించింది. కేరళతో సరిహద్దులను పంచుకుంటోన్న చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటెలో కిందటి నెల 30వ తేదీన అడుగు పెట్టారు రాహుల్ గాంధీ. భారీ వర్షంలోనూ ఆయన యాత్ర కొనసాగుతోంది. సోమవారం రాత్రి మైసూరులో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారాయన. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. మహాత్మగాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని బదనవలులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఖాదీ గ్రామోద్యోగ్ను సందర్శించారు.

కర్ణాటకకు సోనియా గాంధీ..
ఈ పరిణామాల వేళ.. ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీని వీడనున్నారు. కర్ణాటకలో రానున్నారు. ఇవ్వాళ ఆమె కర్ణాటకలో పర్యటించనున్నారు. న్యూఢిల్లీ నేరుగా కొడగు జిల్లా కేంద్రం మడికెరికి చేరుకోనున్నారు. ఇవ్వాళ, రేపు అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. ఎల్లుండి భారత్ జోడో యాత్రలో పాల్గొనున్నారు. ప్రస్తుతం మైసూరులో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర ఎల్లుండికి ఆనుకునే ఉన్న మండ్య జిల్లాలో ప్రవేశిస్తుంది.

511 కిలోమీటర్లు..
ఈ జిల్లాలో భారత్ జోడో యాత్రతో కలుస్తారు సోనియా గాంధీ. అదే రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ యాత్రలో చేరే అవకాశం ఉంది. కర్ణాటకలో సుదీర్ఘంగా కొనసాగనుంది భారత్ జోడో యాత్ర. 21 రోజుల పాటు 511 కిలోమీటర్ల మేర కర్ణాటక మీదుగా ఈ యాత్ర సాగనుంది. బీజేపీ పాలిత రాష్ట్రం.. కర్ణాటక. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక గాంధీ పాల్గొనబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముగ్గురు గాంధీలు ఒకేసారి..
కిందటి నెల 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర చేస్తూ కేరళ మీదుగా కర్ణాటకలో ప్రవేశించారు. ఇప్పటివరకు ఈ యాత్రలో సోనియా గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ ప్రత్యక్షంగా భాగస్వామ్యులు కాలేదు. ఇప్పుడు దీనికి భిన్నంగా ముగ్గురు గాంధీలు భారత్ జోడోలో కనిపించనున్నారు. భారత్ను ఏకం చేయడంలో తన ప్రధాన ఉద్దేశమని రాహుల్ గాంధీ స్పష్టం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications