బీజేపీ లీడర్స్ ఫోన్: మంత్రి పదవి హామీ: బాంబుపేల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆపరేషన్ కమల !
బెంగళూరు: బీజేపీ నాయకులు తనకు మంత్రి పదవి ఇస్తామని, మాకు మద్దతు ఇవ్వాలని ఫోన్ చేసి చెప్పారని కర్ణాటక మాజీ మంత్రి, కుష్టగి శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్ బయ్యాపుర బాంబుపేల్చారు. ఆపరేషన్ కమలతో ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అమరేగౌడ వ్యాఖ్యలతో హడలిపోయారు.
Recommended Video
మంత్రి పదవి
బీజేపీకి మద్దతు ఇస్తే మీకు మంత్రి పదవి ఇచ్చి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని బీజేపీ నాయకులు ఫోన్ చేసి చెప్పారని, వారు ఇప్పటికే తనతో సంప్రధించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్ బయ్యాపుర ఆరోపించారు.
కుమారస్వామి సీఎం
తనకు మంత్రి పదవి మీద ఆశలేదని, బీజేపీకి ఎలాంటి పరిస్థితిలో మద్దతు ఇవ్వనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్ బయ్యాపుర అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ముఖ్యమంత్రిగా తాము హెచ్.డి.కుమారస్వామిని ఎన్నుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్ అన్నారు.
మేము మాట్లాడలేదు
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బసవరాజ్ బోమ్మయ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాము ఏ ఎమ్మెల్యేలతో మాట్లాడలేదని, రెండుమూడు రోజులు రాజకీయాలు ఇలాగే ఉంటాయని అన్నారు. రెండుమూడు రోజుల తరువాత రాజకీయాలు రసవత్తరంగా మారిపోతాయని బసవరాజ్ బోమ్మయ్ జోస్యం చెప్పారు.
బీజేపీతో వద్దు
బీజేపీతో ఏ ఎమ్మెల్యే టచ్ లో ఉండకూడదని, పార్టీ నియమాలు ఉల్లంఘించరాదని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్. జీ. పరమేశ్వర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. కేపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం మొదలైయ్యింది. కుమారస్వామికి మద్దతు ఇచ్చే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుని గవర్నర్ కు లేఖ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యింది.