కాంగ్రెస్కు మహిళా శక్తి సునామీ: రాహుల్, వేధించొద్దని..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మహిళా పవర్ సునామీ అవసరమని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వారికి దిశానిర్దేశం చేశారు.
యుపిఏ ప్రభుత్వం మహిళా అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను, పథకాలను ప్రవేశపెట్టిందని రాహుల్ గాంధీ తెలిపారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సామాన్య ప్రజలకు చేయూతనందించాయని అన్నారు. మహిళల భద్రతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పిన ఆయన, పార్టీ కార్యకర్తలు మహిళలకు అండగా నిలవాలని అన్నారు.
‘మన దేశంలో ప్రజలు దేవాలయాలకు వెళ్లి దేవతలను ఆరాధిస్తారు.. అయితే బస్సు ఎక్కి మహిళలను వేధిస్తారు' అని అన్నారు. దేశంలో ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురైనవారేనని చెప్పారు. మహిళా శక్తి నిద్రలేవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.
మహిళా బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. డిసెంబర్, 2012లో నిర్భయ ఘటన జరిగిన అనంతరం తమ ప్రభుత్వం కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళల భద్రతపై మాటలకే పరిమితమవుతోందని ఆరోపించారు.