కాంగ్రెస్ బిగ్గెస్ట్ ప్లాన్ - భారత్ జోడో యాత్ర వందో రోజు నాడు
జైపూర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 98వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రాజస్థాన్లో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారాయన. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్కు చేరుకుంది. దీని తరువాత హర్యానాలో అడుగు పెట్టనున్నారు రాహుల్ గాంధీ. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లో ఈ యాత్ర ముగియాల్సి ఉంది.
రాజస్థాన్లో..
ఈ తెల్లవారు జామున 6 గంటలకు రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ జిల్లాలోని భదోటీలో జోడో యాత్రను మొదలు పెట్టారు రాహుల్ గాంధీ. ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇందులో భాగస్వామి అయ్యారు. రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేశారు. ఆర్థిక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక స్థితిగతులు, ధరల పెరుగుదల గురించి మాట్లాడారు.
రాజస్థాన్లో భారీ సంఖ్యలో..
కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రం కావడం వల్ల- పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. భదోటీ పట్టణం మొత్తం జనమయమైంది. ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలు, బ్యానర్లు కనిపించాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా-రాబర్ట్ వాద్రా కుమార్తె మిరాయా వాద్రా కూడా భారత్ జోడో యాత్రలో పాలుపంచుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందటే మిరాయా.. జోడో యాత్రలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరిస్తూ ముందుకుసాగారు.
ఎల్లుండి వందో రోజుకు..
ఎల్లుండికి భారత్ జోడో యాత్ర వందో రోజుకు చేరుకోనుంది. దీన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. జైపూర్లో భారత్ జోడో యాత్ర మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించనుంది. బాలీవుడ్ గాయని సునిధి చౌహాన్ ఈ కన్సర్ట్కు హాజరు కానున్నారు. దేశభక్తిని పెంపొందించే గీతాలను ఆమె ఆలపించనున్నారు. సునిధితో పాటు రాజస్థాన్కు చెందిన జానపద కళాకారులు ఇందులో ప్రదర్శన ఇవ్వనున్నారు.
సీఎం సహా..
వందో రోజు భారత్ జోడో యాత్రలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనబోతోన్నారు. శుక్రవారం వారు రాహుల్ గాంధీని కలవనున్నారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం యాత్ర ముగిసే వరకూ వారందరూ రాహుల్ గాంధీతో కలిసి నడుస్తారు. ఆ మరుసటి రోజు యాత్ర ఉండదు. రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకోనున్నారు.