మోడీకి రాహుల్ హగ్: స్పీకర్ ఆగ్రహం, స్మృతి-హర్సిమ్రాత్ కౌర్ విమర్శలు
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించి, ఆ తర్వాత ఆయన కూర్చున్న చోటుకు వెళ్లి ఆలింగనం చేసుకొని, ఆ తర్వాత తన సభ్యుల ప్రశ్నలకు కన్నుగీటిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మోడీపై గల్లా తీవ్రవ్యాఖ్య, నిర్మల ఆగ్రహం: కాంగ్రెస్తో కలిసి.. దులిపేసిన ఎంపీ
సభలో ఎలా ప్రవర్తించాలో కూడా రాహుల్కు తెలియదని ఎద్దేవా చేశారు. రాహుల్ ఇందుకు సిగ్గుపడాలన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేంద్రమంత్రులను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారని, సభలో ఆయన డ్రామా చేస్తూ.. వచ్చి మోడీని కౌగిలించుకున్నారని, ఆయన బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నట్లుగా ఉందని, ఆయనను మేం అక్కడికే పంపించేస్తామని అని బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ అన్నారు.
రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విమర్శలు
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా దీనిపై స్పందించారు. లోకసభలో రాహుల్ గాంధీ అబద్దపు ప్రచారాన్ని అందరూ చూశారని, అందుకు ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తన వాక్చాతుర్యాన్ని చూపించుకోవడానికే ఇలా చేశారన్నారు. కానీ అదే ఆయనను ప్రతి ఎన్నికల్లో ఓడిపోయేలా చేస్తోందన్నారు. రాహుల్ది కపటప్రేమ అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా ప్రధాని మోడీ నవ్వుతున్న చిత్రాలను ఆమె పోస్ట్ చేశారు.
ఎదిగారు కానీ, పరిణితి కొరవడింది
రాహుల్ గాంధీ అనుభవలేమి, సభలో ఎలా ప్రవర్తించాలనే దానిపై పరిమితులు తెలియకపోవడం కారణంగానే ఈరోజు కొన్ని విచిత్రాలను చూడాల్సి వచ్చిందని కేంద్రమంత్రి అనంత్ కుమార్ అన్నారు. అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు సభను తప్పుదోవ పట్టించేందుకు ఇటువంటి పనులు చేశారన్నారు. ఆయన ప్రవర్తన చిన్నపిల్లల మాదిరిగా ఉందన్నారు. ఆయన ఎదిగారు కానీ ఆయనలో ఆ పరిణతి కొరవడిందన్నారు.
హర్సిమ్రాత్ కౌర్ విమర్శలు
శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రాత్ కౌర్ మాట్లాడుతూ.. ఇది పార్లమెంటు అని, మున్నాభాయ్ ఆలింగనం చేసుకునే ప్రదేశం ఇక్కడ కాదని, పార్లమెంటులో ఇలా ప్రవర్తించడం ఏమిటని వ్యాఖ్యానించారు.
స్పీకర్ సుమిత్రా మహాజన్
మోడీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడం, కన్నుగీటడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ హుందాతనాన్ని కాపాడాలంటూ రాహుల్కు సూచించారు. అంతకు ముందు ఇదే విషయంపై రాజ్నాథ్ మాట్లాడుతూ.. సభలో విపక్షాలు చిప్కో ఉద్యమం ప్రారంభించాయనడంతో స్పీకర్ కల్పించుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. సభ హుందాతనాన్ని కాపాడాలంటూ సభ్యులకు సూచించారు. హుందాను కాపాడాల్సింది సభ్యులే కానీ బయటవాళ్లు కాదన్నారు. మోడీని ఆలింగనం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. అది సరైంది కాదన్నారు. రాహుల్ పైన తనకు ద్వేషం లేదని, ఆయన తనకు కొడుకులాంటివాడన్నారు. బయట ఒకరికొకరు ఆలింగనం చేసుకోవడంపై అభ్యంతరం లేదని, కానీ సభలో హుందాగా ప్రవర్తించాలన్నారు. రాహుల్ జీవితంలో ఎదగాల్సిన నేత అని, సంప్రదాయాలు ఆయనకు నేర్పిస్తున్నారన్నారు.