సోనియా గాంధీకి 70కి పైగా ప్రశ్నలు: తదుపరి చర్యలపై?: ముగిసిన మూడోరోజు విచారణ
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ మూడో రోజు విచారణ ముగిసింది. కొద్దిసేపటి కిందటే ఆమె దేశ రాజధానిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి తన 10, జన్పథ్ నివాసానికి చేరుకున్నారు. ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరు కావడం వరుసగా ఇది మూడో సారి. ఈడీ అధికారులు మరోసారి ఆమెకు ఎలాంటి సమన్లను కూడా జారీ చేయలేదని తెలుస్తోంది. సమన్లను జారీ చేయకపోవడం వల్ల- విచారణ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

18 వరకు ప్రశ్నలు..
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరయ్యారు. ఈ రెండు రోజులకు కలిపి 55 ప్రశ్నలను సంధించారు అధికారులు. వాటన్నింటికీ ఆమె సంతృప్తికరమైన వివరణలు ఇచ్చారని ఏఐసీసీ వర్గాలు చెబుతోన్నాయి. ఇవ్వాళ కూడా దాదాపు 12 నుంచి 18 ప్రశ్నలను వేశారని, వాటికి సోనియా గాంధీ సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది.

మూడు రోజుల్లో
ఈ మూడు రోజుల పాటు జరిగిన విచారణ సందర్భంగా సోనియా గాంధీ ఇచ్చిన సమాచారాన్ని, తాము వేసిన ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను ఈడీ అధికారులు బేరీజు వేసుకోవాల్సి ఉంది. దీని తరువాతే ఆమెపై తదుపరి చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది అధికారులు నిర్ణయిస్తారని చెబుతున్నారు. ఈ మూడు రోజుల పాటు 70కి పైగా ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారని, వాటన్నింటికీ ఆమె ఓపికగా బదులిచ్చారని సమాచారం.

తాజా సమన్లు లేనట్టే..
సోనియా గాంధీకి తాజాగా ఇప్పటివరకు ఎలాంటి సమన్లు జారీ కాలేదు. దీనితో ఈడీ విచారణ పూర్తిగా ముగిసినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తొలి రెండు రోజుల పాటు విచారించిన సమయంలో అప్పటికప్పుడు సోనియా గాంధీకి సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితి మూడోరోజు ఆమెకు ఎదురు కాలేదు.

ఇదివరకు రాహుల్ గాంధీ..
నేషనల్ హెరాల్డ్ కేసులోనే ఇదివరకు సోనియా గాంధీ కుమారుడు, వాయనాడ్ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఆయనను కూడా మూడు రోజుల పాటు అధికారులు విచారించారు. ఆ తరువాత తుదపరి చర్యలకు దిగలేదు. ఇప్పుడు అదే పరిస్థితి సోనియా గాంధీ విషయంలో జరగొచ్చని పార్టీ నాయకులు భావిస్తున్నారు. తాజా సమన్లు జారీ కాకపోవడం వల్ల మరోమారు విచారణ ఉండకపోవచ్చని అంటున్నారు.

ర్యాలీలు, అరెస్టులతో..
మరో వంక- సోనియా గాంధీని ఈడీ విచారించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలను లేవనెత్తారు. ఇవ్వాళ కూడా దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. ఆందోళనలకు దిగిన పలువురు కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లికార్జున ఖర్గె, అధిర్ రంజన్ చౌదరి సహా పలువురు ఎంపీలు పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీని నిర్వహించారు. విజయ్ చౌక్ వద్ద బైఠాయించారు. సీబీఐ, ఈడీని కేంద్రం ఉద్దేశపూరకంగా ప్రయోగిస్తోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications