ఎవరు ముక్కలు చేశారు?: మోడీ, సవాలేనని చిదంబరం
అహ్మదాబాద్/పనాజీ: కాంగ్రెసు దేశ విభజన పాపానికి ఒడిగట్టిందని, నెహ్రూ - గాంధీ కుటుంబాన్ని మాత్రమే స్తుతించి, ఇతర స్వతంత్ర పోరాట వీరులను నిర్లక్ష్యం చేయడం ద్వారా చరిత్రను మార్చేసిందని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మండిపడ్డారు. బిజెపి నేతలు దేశ చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని మార్చేశారని ప్రధాని చేసిన విమర్శలకు మోడీ కౌంటర్ ఇచ్చారు.
ప్రధానమంత్రి పుట్టిన గ్రామం హిందూస్తాన్లో భాగమని, ప్రస్తుతం మాత్రం అది లేదని, ఎవరు భౌగోళిక స్వరూపాన్ని మార్చారని, ఎవరు దేశాన్ని ముక్కలు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెసు పాలనలోనే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని విమర్శించారు. నెహ్రూ, ఇందిరలు జీవించి ఉన్నప్పుడే భారతరత్నలు ఇచ్చారని, అదే సర్దార్ పటేల్ మరణించిన 41 ఏళ్లకు, ఆంబేడ్కర్కు స్వాతంత్ర్యం వచ్చిన 33 ఏళ్లకు ఇచ్చారన్నారు. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు.
మోడీ మాకు సవాల్: చిద్దూ
మోడీని కాంగ్రెస్ పార్టీ ఒక సవాలుగానే పరిగణిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఆదివారం అంగీకరించారు. ఒక రాజకీయ పార్టీగా మేము మోడీని ఓ సవాలుగానే పరిగణిస్తున్నామని, ఆయన ప్రాబల్యాన్ని విస్మరించలేమని, ప్రధాన ప్రతిపక్షం బరిలోకి దింపిన అభ్యర్థి ఆయనను తాము తప్పక పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
అయితే ఒక వ్యక్తిగా తాను ఆయన ఆలోచనా ధోరణి, సిద్ధాంతాలు, బహిరంగ సభల్లో ఆయన ఉపయోగిస్తున్న భాష గురించి ఆందోళన చెందుతున్నానని చిదంబరం చెప్పారు. అయినా ఇప్పటివరకు మోడీ చాలా అస్పష్టంగా ఉన్నారని, ఏ ప్రధాన సమస్య గురించి కూడా ఆయన మాట్లాడలేదని, కేవలం ఎన్నికల హామీలు మాత్రమే ఇస్తున్నారన్నారు.