పంజాబ్ పై కాంగ్రెస్ లో అసంతృప్త స్వరాలు-మళ్లీ గళం విప్పిన కపిల్ సిబల్-అలా జరక్కూడదంటూ..
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విషయంలో గతంలో అసంతృప్త స్వరాలు వినిపించిన 23 మంది నేతలకు పంజాబ్ లో జరుగుతున్న పరిణామాలు బాగా కలిసొచ్చాయి. దీంతో ఈ 23 మందిలో కొందరు ఇప్పుడు పంజాబ్ ఎపిసోడ్ ను వాడుకుంటూ కాంగ్రెస్ హైకమాండ్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టేశారు.
పంజాబ్ లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ అసంతృప్త నేత కపిల్ సిబల్.. అలా జరగి ఉండాల్సింది కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఉండాల్సింది కాదంటూ కపిల్ సిబల్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే తనతో కలిసి 23 మంది నేతలు కాంగ్రెస్ నాయకత్వం మార్పు కోసం గతంలో డిమాండ్ చేసిన విషయాన్ని సైతం కపిల్ సిబల్ గుర్తుచేశారు.
మరోవైపు పార్టీని వీడిన నేతలంతా తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు కలిసి రావాలని సీనియర్ నేత అయిన కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలదంటూ వారికి సిబల్ గుర్తుచేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ఆలస్యమవుతున్న విషయాన్ని ఇవాళ ఆయన్ను మీడియా సమావేశంలో విలేఖరులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని గుర్తు చేస్తూ అలా జరగాల్సింది కాదన్నారు.
తనతో పాటు జీ23గా పిలుస్తున్న అసంతప్త నేతలు పార్టీని వీడాలని భావించడం లేదని, కేవలం బలోపేతం చేయాలని మాత్రమే భావిస్తున్నట్లు కపిల్ సిబల్ పేర్కొన్నారు. తనతో ఏకీభవించే నేతలతో కలిసి గతేడాది ఇందుకోసం డిమాండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎంతో గొప్ప వైభవం కలిగిన పార్టీలో తానూ సభ్యుడినేనని కపిల్ సిబల్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్ధితులు వస్తాయని తాను ఎప్పుడూ అనుకోలేదని సిబల్ వ్యాఖ్యానించారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి బావున్న రోజుల్లో నోరు మెదపని అసంతృప్త నేతలు.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నాయకత్వ మార్పు కోరుతూ స్వరం పెంచారు. సాధ్యమైనంత త్వరగా అధ్యక్ష ఎన్నికలు జరగాలని, ఇందులో తమకూ పోటీ పడే అవకాశం కల్పించాలని డిమాండ్లు చేస్తూ వస్తున్నారు. అయితే అధినేత్రి సోనియా మాత్రం ప్రస్తుత పరిస్ధితుల్లో నాయకత్వ మార్పుతో పార్టీ పరిస్ధితి మరింత దారుణంగా మారుతుందని వారికి నచ్చచెప్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో పంజాబ్ సంక్షోభం వారికి కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.