ఉత్తరాఖండ్ పోరులో బిపిన్ రావత్ మంత్ర-రాహుల్ కటౌట్లలో దివంగత సీడీఎస్ ఫోటోలు
ఉత్తరాఖండ్ లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. అక్కడి బీజేపీ ప్రభుత్వ తప్పిదాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపొందడం అంత సులువు కాదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వేగంగా వ్యూహాలు మార్చేస్తోంది ఇందులో భాగంగా తాజాగా మృతిచెందిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ ను కాంగ్రెస్ వాడేసుకుంటోంది.
ఉత్తరాఖండ్ పోరులో ప్రజల్ని ఆకట్టుకునేందుకు బీజేపీ కంటే ముందుగా కాంగ్రెస్ రంగంలోకి దిగిపోయింది. కేంద్రంలో బీజేపీ తొలి సీడీఎస్ గా నియమించిన బిపిన్ రావత్ తాజాగా హెలికాఫ్టర్ దుర్ఘటనలో చనిపోయినా ఆయన్ను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కటౌట్లలో ఆయన ఫొటోలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఆయన కటౌట్లలో రావత్ ఫొటోలు కనిపించాయి.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్లో ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు అధికార బిజెపి కూడా సైనికుల కార్డును వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ ర్యాలీ కోసం, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పాటు ఇటీవలే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ కటౌట్ను ప్రముఖంగా ఉంచారు. ముఖ్యంగా రావత్ కటౌట్ పరిమాణం రాహుల్ గాంధీ కంటే పెద్దదిగా ఉంది.
రాష్ట్ర ఎన్నికల బరిలో మాజీ సైనికుల కుటుంబాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. దీంతో రాహుల్ ర్యాలీకి ఒక రోజు ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డెహ్రాడూన్లో యుద్ధ స్మారకానికి శంకుస్థాపన చేశారు. ఈ స్మారకం ప్రవేశ ద్వారానికి జనరల్ రావత్ పేరు పెట్టారు. ఈ సందర్భంగా దాదాపు 200 మంది అమరవీరుల కుటుంబాలను అధికార బీజేపీ ఘనంగా సన్మానించింది.
పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొంది 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ ర్యాలీ నిర్వహించిన రాహుల్ గాంధీ తన 'విజయ్ సమ్మాన్ ర్యాలీ'లో సైనికుల సమస్యలపై దృష్టి పెట్టారు. 1971లో, ఇందిరా గాంధీ చివరికి పాకిస్తాన్ను అణిచివేసిన భారత బలగాలకు అనుమతినివ్వడాన్ని ఆయన ప్రస్తావించబోతున్నారు.