కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్... తెర పైకి సోనూ సూద్ సహా ఆ ఇద్దరు సెలబ్రిటీల పేర్లు... వర్కౌట్ అవుతుందా?
వచ్చే ఏడాది జరగబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్(BMC) ఎన్నికల కోసం ముంబై కాంగ్రెస్ కొత్త వ్యూహాలను తెర మీదకు తెస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను... ముఖ్యంగా యువతకు చేరువైన వ్యక్తులను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీకి బిగ్ మైలేజ్ వస్తుందని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే స్ట్రాటజీ డాక్యుమెంట్ను సిద్దం చేసిన ముంబై కాంగ్రెస్... అందులో ముగ్గురు సెలబ్రిటీల పేర్లను ప్రస్తావించడం విశేషం. అలాంటి వ్యక్తులను ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి మేలు జరుగుతుందని అందులో అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు గానీ... ముంబై కాంగ్రెస్ చేసిన ఈ ప్రతిపాదన మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.

ఎవరా ముగ్గురు...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ తనయుడు,సినీ నటుడు రితేశ్ దేశ్ముఖ్,నటుడు సోనూ సూద్,మోడల్ మిలింద్ సోమన్ పేర్లను ముంబై కాంగ్రెస్ రూపొందించిన స్ట్రాటజీ డాక్యుమెంట్లో ప్రస్తావించారు. ఇలాంటి వ్యక్తులను మేయర్ అభ్యర్థిగా ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 25 పేజీల ఈ స్ట్రాటజీ డాక్యుమెంట్ను ముంబై కాంగ్రెస్ సెక్రటరీ గణేశ్ యాదవ్ రూపొందించారు. ఈ డ్రాఫ్ట్ను పార్టీ నేతలు పరిశీలించాల్సి ఉంది. మరికొద్దిరోజుల్లోనే మహారాష్ట్ర ఏఐసీసీ సెక్రటరీ ఇన్చార్జి హెచ్కె పాటిల్కు ఈ డ్రాఫ్ట్ను సమర్పిస్తారని తెలుస్తోంది.

ఆ విషయంపై తేల్చాలని...
గణేశ్ యాదవ్ మాట్లాడుతూ... ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగ్తాప్ పార్టీ సీనియర్లతో కలిసి దీనిపై చర్చిస్తారని తెలిపారు. ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించడం... రాజకీయ నేపథ్యం లేని వ్యక్తిని అందుకు ఎంపిక చేయడం... డ్రాఫ్ట్లో ఈ రెండు విషయాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిపారు. యువతలో మంచి ఆదరణ ఉన్న వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని పేర్కొన్నట్లు చెప్పారు.అలాగే కార్పోరేషన్ ఎన్నికల్లో కొన్ని టికెట్లు యంగ్ ప్రొఫెషనల్స్,సామాజిక కార్యకర్తలు,స్టారప్ ఓనర్స్కు ఇస్తే బాగుంటుందని... తద్వారా పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందని సూచించామన్నారు. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేయడమా లేక ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడమా అనేది తేల్చాలని కోరినట్లు చెప్పారు.
Recommended Video

వర్కౌట్ అవుతుందా...?
బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన ఆధిపత్యమే నడుస్తోంది. 1997 నుంచి 2012 వరకు బీజేపీతో కలిసి బీఎంసీ ఎన్నికల్లో గెలిచింది శివసేన. 2017లో ఒంటరిగానే పోటీ చేసి మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈసారి శివసేన... కాంగ్రెస్,ఎన్సీపీలతో కలిసి బీఎంసీలో పోటీ చేస్తుందా... లేదా ఎవరి దారి వారిదేనా అనేది వేచి చూడాలి. దీనిపై త్వరగా తేల్చుకుని బీఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా ముంబై కాంగ్రెస్ సిద్ధం చేసిన స్ట్రాటజీ డ్రాఫ్ట్లో... ఒకవేళ పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ కార్పోరేటర్లు లేని చోట త్వరగా అభ్యర్థులను తేల్చాలని కోరారు. అలాగే వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ),ఎంఐఎం పార్టీలను బీజేపీ బీ టీమ్గా ప్రచారం చేయాలన్నారు. ఆ విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. అయితే సోనూ సూద్,మిలింద్ సోమన్,రితేశ్ దేశ్ముఖ్ల పేర్లను డ్రాఫ్ట్లో ప్రస్తావించిన నేపథ్యంలో... ఆ సెలబ్రిటీలను రాజకీయాల్లోకి తీసుకురావడం సాధ్యమేనా... అందుకు వారు అంగీకరిస్తారా అనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications