కరోనా భయాలతో పెరుగుతున్న విశ్వాసాలు: పూనకంలో మహిళ , చెట్లకు పెళ్లి చేసిన గ్రామం
దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంది . కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి అయినా కరోనా కంట్రోల్ లోకి రావడం లేదు . ఇదే సమయంలో ప్రజల్లో కరోనా తాలూకు భయాలు కూడా పెరిగిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ నుండి రక్షించాల్సిన బాధ్యత భగవంతునిదే అని పలువురు దేవుడి మీద భారం వేస్తుంటే , మరికొందరు కరోనా పోవాలంటే ఇది చేయాలి ,అది చేయాలి అంటూ మూఢ విశ్వాసాలతో రకరకాల చర్యలకు దిగుతున్నారు.
Recommended Video
పెళ్లి పత్రికలు పంచి మరీ ఘనంగా చెట్లకు పెళ్లి
కరోనా భయాలతో పెరుగుతున్న విశ్వాసాలు పెరుగుతున్నాయి. తాజాగా తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలూకా నరియంపేటలో శ్రీతంజయమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న రాగి, వేప చెట్లకు పెళ్లి చేస్తే కరోనా నుండి ప్రజలను కాపాడవచ్చని ఓ మహిళ తనకు అమ్మవారి పూనకం వచ్చినట్లుగా, పూనకంలో అమ్మవారు చెప్పినట్లుగా పేర్కొంది. దీంతో గ్రామస్తులంతా పెళ్లి పత్రికలు కొట్టించి గ్రామంలో పంచి, ఆలయ ప్రాంగణాన్ని కళ్యాణానికి ముస్తాబు చేసి అత్యంత ఘనంగా వేప చెట్టుకు రావిచెట్టుకు వివాహం జరిపించారు.
వేప, రావి చెట్లకు శాస్త్రోక్తంగా పెళ్లి చేసిన గ్రామస్థులు
మేళతాళాల నడుమ, వేద మంత్రాల మధ్య , పట్టు వస్త్రాలు రెండు చెట్లకు కట్టి వేప ,రావి చెట్లకు గ్రామస్తులందరి సమక్షంలో అత్యంత ఘనంగా కళ్యాణం జరిపించారు.గతంలో ఆలయ నిర్మాణం సమయంలో కూడా ఇదే మహిళకు అమ్మవారు పూనకం రాగా ఆలయ ప్రాంగణంలో ఉన్న వేప, రావి చెట్లు నరకవద్దని అవి గ్రామస్తులను కాపాడతాయని చెప్పినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆక్సిజన్ కొరతను నివారించడానికి కోసం, కరోనా నుండి బయటపడడం కోసం ఈ రెండు చెట్లకు వివాహం జరిపించాలని చెప్పగా, ఘనంగా వివాహం జరిపించారు గ్రామస్తులు.
సాంప్రదాయం ప్రకారం బంగారు తాళిబొట్టు ను వేప చెట్టుకు కట్టి వివాహం
వేద పండితుల ఆధ్వర్యంలో తాంబూలాలు మార్చుకుని సాంప్రదాయం ప్రకారం బంగారు తాళిబొట్టు ను వేప చెట్టుకు కట్టి వివాహం జరిపించారు. ఇక వివాహానంతరం గ్రామస్తులు అందరికీ విందును సైతం ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు గ్రామస్తులు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కాలంలో చెట్లు, పుట్టలను పూజించడమే కాకుండా, మూఢ విశ్వాసాలతో పలు చర్యలకు దిగుతున్నారు ప్రజలు.
చెట్లను పూజించటం మంచిదే కానీ, చెట్లను పూజిస్తే మహమ్మారి కట్టడి అవుతుంది అన్న భావన మాత్రం శాస్త్ర విజ్ఞానానికి అందనిది. ప్రజల విశ్వాసానికి సంబంధించింది. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుకోవడం కోసం వేప , రావి చెట్లకు పెళ్ళి చేయడం మాత్రం ఆసక్తిని కలిగిస్తున్న అంశం.
కరోనా భయాలు ... పెరుగుతున్న విశ్వాసాలు
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి ఎలా ఉన్నా కరోనా వైరస్కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో వదంతులు, మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి . గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక కరోనా రాకుండా ఉండాలంటే రక రకాల ప్రయోగాలు, పూజలు, వేప చెట్టుకు నీళ్ళు పోయటం వంటి ఉదంతాలు గతంలోనే చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు ఎవరు ఏది చెప్తే అది నమ్మకూడదని, ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.