కరోనా వైరస్: ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోరాడిన ఆ కుటుంబం చివరకు ఎలా ఓడిపోయింది
దేశంలో కరోనా వైరస్ బారిన పడిన లక్షలు, కోట్లమంది భారతీయులలో 59 ఏళ్ల అనూప్ సక్సేనా ఒకరు. అందరిలాగే ఆయన కుటుంబం కూడా కోవిడ్ నుంచి ఆయనను రక్షించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. కానీ చివరికి జరగకూడనిదే జరిగింది.
దేశంలో ఆసుపత్రులన్నీ కోవిడ్ పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. మే నెల ఆరంభం నాటికి ఆక్సిజన్ కొరత విపరీతంగా ఉంది. కానీ, అనూప్ సక్సేనా నివసించే ఉత్తర్ ప్రదేశ్లోని గాజియాబాద్ ప్రాంతంలో అలాంటి కొరత ఏమీ లేదని అధికారులు పదే పదే చెబుతూనే ఉన్నారు.
కోవిడ్ వైరస్ వల్ల సక్సేనాకు ఇబ్బందులు తీవ్రతరమైన తర్వాత కొద్ది రోజులు ఎలా సాగాయో చూస్తే, సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా, క్లిష్టంగా ఉంటుందో అర్ధమవుతుంది. సక్సేనా కుటుంబం ఎక్కడికి వెళ్లినా అవసరమైన సాయం అందలేదు. అందేటప్పటికి పరిస్థితి చేయిదాటి పోయింది.
సక్సేనా కుటుంబం ఆయన్ను రక్షించుకోవడానికి చేసిన పోరాటాన్ని మీ ముందుంచుతున్నాం.
టెస్ట్ చేసే పరిస్థితి లేదు
ఏప్రిల్ 29న అనూప్ సక్సేనా విపరీతమైన జ్వరంతో బాధపడగా, కోవిడ్-19 టెస్ట్ చేయించాలని డాక్టర్లు సూచించారు. అనూప్ కుటుంబం ఇంటి దగ్గరే టెస్ట్కు స్లాట్ బుకింగ్ కోసం ప్రయత్నించగా, తమ వద్ద సిబ్బంది లేరని లేబరేటరీలు తిరస్కరించాయి.
దీంతో ఆయన్ను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ భారీ క్యూ ఉంది. ఎలాగోలా ముందుకెళదామని అనూప్ కుమారుడు తుషార్ భావించారు. కానీ తమ ముందున్న వారు కూడా దాదాపు అనూప్ లాగే తీవ్రమైన ఇబ్బందుల్లో కనిపించారు.
రెండు గంటలు వేచి చూసిన తర్వాత, విధిలేక సక్సేనాను తిరిగి ఇంటికి తీసుకు వచ్చారు.
ఉదయం 10 గంటలు.. శ్వాస ఇబ్బంది
మే 1 నాటికి అనూప్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఉదయం లేవటంతోనే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని అనూప్ చెప్పారు. ఆ ఇబ్బందిని తొలగించడానికి కుటుంబ సభ్యులు నెబులైజర్ ఏర్పాటు చేశారు.
అది కొంత వరకు ఉపయోగపడినా, ఆయన ఆక్సిజన్ లెవెల్స్ క్రమంగా పడిపోవడం మొదలు పెట్టాయి.
అనూప్ను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని డాక్టర్ సూచించారు. అంబులెన్స్ల కోసం ప్రయత్నించగా, దొరక్క పోవడంతో, హాపూర్ జిల్లాలో ఉన్న బంధువులను కారు తీసుకు రావాల్సిందిగా కోరారు తుషార్.
అక్కడి నుంచి వారి ఇంటికి దూరం సుమారు 27 కి.మీ.
మధ్యాహ్నం 2 గంటలకు అనూప్ బంధువు కారు తీసుకుని వచ్చారు. కానీ, అప్పటికే ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఆసుపత్రిలో బెడ్ దొరక లేదు. సమయం సాయంత్రం 4 గంటలు దాటింది.
కనీసం ఆక్సిజన్ దొరుకుతుందన్న నమ్మకంతో ఆయన్ను సమీపంలో ఉన్న గురుద్వారా శ్రీగురు సింగ్ సభాకు తీసుకెళ్లారు. అక్కడ ఆక్సిజన్ లభించింది.
సాయంత్రం 7:30 గంటలు.. హాస్పిటల్ బెడ్ కోసం అన్వేషణ
గురుద్వారాలో ఆక్సిజన్ పెట్టినంత సేపు ఆయన ఆరోగ్యం కాస్త మెరుగ్గా కనిపించింది. అయితే, అక్కడ ఎక్కువ సేపు ఉంచడం కుదరని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని గురుద్వారా వలంటీర్లు సూచించారు.
తన తండ్రిని అక్కడే ఉంచాలని వలంటీర్లును వేడుకున్నా, ఎక్కువ సేపు ఉంచడం మంచిది కాదని తుషార్కు కూడా తెలుసు.
అక్కడి నుంచి అనూప్ సక్సేనాను ఎంఎంజీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అక్కడికి వెళ్లి గంటసేపు ప్రయత్నించినా బెడ్ దొరకలేదు.
రాత్రి 8 గం.లు- ఆక్సిజన్ కోసం అన్వేషణ
సాయంత్రం 8 గంటల వరకు కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. ఈలోగా లాల్ క్వాన్లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ దగ్గరకు వెళ్లి సిలిండర్ నింపుకొని రావాలని తుషార్ తన సోదరుడికి సూచించారు. కానీ, అక్కడ పెద్ద క్యూ ఉంది.
పదే పదే తన సోదరుడికి ఫోన్ చేస్తూ ఆక్సిజన్ సిలిండర్ నింపగలిగింది లేనిదీ తెలుసుకుంటూనే ఉన్నారు తుషార్. ఆక్సిజన్ సిలిండర్, ఆసుపత్రి బెడ్, ఈ రెండింటిలో ఏది దొరక్కపోయినా ఈ రాత్రి తండ్రి ఆరోగ్యానికి పెను ప్రమాదం తప్పదని ఆయనకు తెలుసు.
రాత్రి 8.30 గం.లు-ఆసుపత్రిలో బెడ్ దొరుకుతుందన్న ఆశలేదు.
బెడ్ దొరక్కపోవడంతో తుషార్ తండ్రిని ఇంటికి తీసుకు వచ్చారు. ఆక్సిజన్ను అందించే 25 క్యాన్లను కొనుక్కు వచ్చారు. ఈ క్యాన్లు బాధితులకు కొద్దికొద్దిగా ఆక్సిజన్ అందించడానికి ఉపయోగపడతాయి తప్ప వీటితో నిరంతరం ఆక్సిజన్ అందించడం సాధ్యం కాదు.
ఈ ఆక్సిజన్ క్యాన్ ధర ఒక్కొక్కటి రూ.2500 చెప్పారు. మామూలు పరిస్థితులలో వాటి ధర రూ.వెయ్యి లోపే ఉంటుంది. ఇంత ఖర్చును భరించడం మధ్య తరగతి కుటుంబానికి చెందిన తుషార్ లాంటి వారికి చాలా కష్టమైన పని. కానీ, అంతకన్నా వేరే మార్గం లేదు.
సోదరుడు తెచ్చే ఆక్సిజన్ సిలిండర్ కోసం ఎదురు చూస్తూనే, ఈ క్యాన్లతో తండ్రికి ఆక్సిజన్ పట్టించేందుకు తుషార్ ప్రయత్నించారు. ఎక్కువ సేపు ఆక్సిజన్ పట్టడంతో అనూప్ సక్సేనా కాస్త కుదుటపడ్డారు.
తన వంతు వచ్చేసరికి ఆక్సిజన్ అయిపోయిందంటూ అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తుషార్ సోదరుడు ఖాళీ సిలిండర్తో ఇంటికి చేరుకున్నారు.
ఉదయం 10 గంటలు.. ఆసుపత్రిలో బెడ్ కోసం మళ్లీ అన్వేషణ
సక్సేనాను ఎలాగైన ఆసుపత్రిలో చేర్చాలంటూ డాక్టర్ మరోసారి సూచించడంతో ఈసారి ఆయన్ను గార్గి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే ఇక్కడ కూడా బెడ్స్ ఖాళీ లేవని, వేరే ఆసుపత్రిలో ప్రయత్నించాలని సిబ్బంది చెప్పారు.
దీంతో, అక్కడి నుంచి సర్వోదయ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ కూడా బెడ్స్ ఖాళీ లేవు.
అప్పటికే అనూప్ మళ్లీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఇంటికెళదామని ఆయన కోరారు. కానీ, తుషార్ ఆశ వదులు కోలేదు.
అప్పటికే మధ్యాహ్నం 12 గంటలయింది. తర్వాత వారు సంతోష్ హాస్పిటల్కు చేరుకున్నారు. ఇది వారు సంప్రదించిన మూడో ఆసుపత్రి. అక్కడికి వెళ్లాక, కాసేపు వేచి ఉండాలని ఆసుపత్రి సిబ్బంది కోరారు. ఆసుపత్రి చుట్టూ భద్రతా సిబ్బంది మోహరించి ఉన్నారు.
తాము ఆసుపత్రికి వచ్చామా, జైలుకు వచ్చామా అన్న అనుమానం కలిగింది అనూప్ కుటుంబ సభ్యులకు. అక్కడ పది నిమిషాలు ఎదురు చూసిన తర్వాత వేరే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు తుషార్.
తన తండ్రి ప్రాణం ఏ ఆసుపత్రులో పోతుందో అని తుషార్ భయ పడుతున్నా...తల్లి ఫోన్ చేసినప్పుడు, బెడ్ దొరికిందని, అంతా బాగానే ఉందని చెబుతూ వచ్చారు.
తండ్రిని తీసుకుని నాలుగో ఆసుపత్రికి చేరుకున్నారు తుషార్. అప్పటికి సమయం మధ్యాహ్నం 12.30 దాటింది. ఎవరైనా డిశ్చార్జ్ అయినా, మరణించినా బెడ్ దొరుకుతుందని, అప్పటి వరకు ఖాళీ లేదని గేటు దగ్గర సెక్యురిటీ గార్డు తేల్చి చెప్పారు.
తన తండ్రికి బెడ్ దొరకాలంటే ఎవరో ఒకరు చనిపోవాలా అని బాధపడ్డారు తుషార్. అప్పటికే ఆక్సిజన్ క్యాన్లు అయిపోవడంతో, అనూప్ శ్వాస తీసుకోవడంలో మళ్లీ ఇబ్బంది పడుతున్నారు.
మధ్యాహ్నం 2 గం.లు-గురుద్వారా నుంచి మరోసారి సాయం
పరిస్థితి విషమిస్తున్నట్లు కనిపిస్తుండటంతో తుషార్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ను మరోసారి గురుద్వారాకు దగ్గరికి తీసుకు వచ్చారు. ఇప్పటి వరకు తండ్రి ఆరోగ్యానికి ఉపయోగపడిన ప్రదేశం అదొక్కటే.
అక్కడ ఆయనకు ఆక్సిజన్ అందడంతో ఆక్సిజన్ లెవెల్స్ కాస్త పెరిగాయి.
మధ్యాహ్నం 3గం.లు- ఆక్సిజన్ కోసం కొనసాగిన అన్వేషణ
ఒక పక్క తండ్రిని ఆసుపత్రులకు తిప్పుతూనే, ఆక్సిజన్ సిలిండర్ కోసం ప్రయత్నించాల్సిందిగా సోదరుడికి సూచించారు తుషార్. కానీ, ఆయన ప్రయత్నాలు ఎక్కడా ఫలించ లేదు. ఎక్కడ చూసినా పొడవైన క్యూలు కనిపించాయి.
బులంద్ షహర్ ప్రాంతంలో ఆక్సిజన్ ప్లాంట్ ఉందని, అక్కడి వెళితే సిలిండర్ దొరకవచ్చని ఎవరో చెప్పడంతో అక్కడి నుంచి గంట ప్రయాణం దూరంలో ఉన్న బులంద్ షహర్ కు చేరుకున్నారు తుషార్ సోదరుడు. కానీ అప్పటికే ప్లాంట్ మూసేసి ఉంది.
తిరిగి గాజియాబాద్ వచ్చిన తుషార్ సోదరుడు, ఐదు లీటర్ల సిలిండర్ను బ్లాక్ మార్కెట్లో కొనుక్కొచ్చారు.
సాయంత్రం 5.30 గం.లకు - చివరి ప్రయత్నం
అనూప్ సక్సేనాను ఆసుపత్రిలో చేర్చాలని డాక్టర్ చెప్పిన 8 గంటల తర్వాత కూడా తుషార్ ఇంకా గురుద్వారాలోనే ఉండాల్సి వచ్చింది.
ఈ లోగా సక్సేనా కుమార్తె అలీగఢ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్ దొరికిందని, అక్కడి తీసుకురావాల్సిందిగా తన సోదరులకు సూచించారు. గురుద్వారా నుంచి అలీగఢ్కు 120 కిలోమీటర్ల దూరం.
సాయంత్రం 6 గంటల సమయంలో తండ్రితోపాటు, చిన్న ఆక్సిజన్ సిలిండర్ను వెంటబెట్టుకుని తుషార్ అలీగఢ్ బయలుదేరారు. రాత్రి 8.30 కల్లా వారు అలీగఢ్ చేరారు.
డాక్టర్లు సక్సేనాను హుటాహుటిన ఐసీయూలో చేర్చారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ఉదయం 4 గంటలు.. యుద్ధంలో ఓటమి.
8 గంటల పాటు ఐసీయూలో ఉంచిన తర్వాత కూడా అనూప్ ఆరోగ్యం కుదుటపడలేదని, విషమంగా మారుతోందని డాక్టర్లు చెప్పారు. కానీ, తుషార్ మాత్రం డాక్టర్లు ఏదో అద్భుతం చేస్తారని ఆశించారు.
మరో ఆరుగంటల తర్వాత అనూప్ పరిస్థితి మరింత విషమించిందని, కడసారి చూపులు చూసుకోవచ్చని వైద్యులు చెప్పారు. అప్పటికి ఉదయం 10 గంటలైంది. మరో గంట తర్వాత అనూప్ సక్సేనా తుదిశ్వాస విడిచారు.
నీటి నుంచి ఒడ్డున పడ్డ చేపలాగా తమ తండ్రిని ఇబ్బందులు పడుతుంటే ఏమీ చేయలేక చూస్తూ ఉండాల్సిన తమ దుస్థితి ఏ కొడుక్కి రావద్దని సక్సేనా కుమారుడు తుషార్ అన్నారు.
ఈ వ్యవస్థే తన తండ్రిని చంపిందని తుషార్ ఆరోపించారు.
తండ్రి మరణ వార్తతోనే బాధపడుతున్నవారికి తల్లి ఆరోగ్యం కూడా బాగా లేదని ఫోన్ రావడంతో వారు అక్కడ నుంచి తిరిగి గాజియాబాద్ బయలుదేరారు.
(రూట్ మ్యాప్స్: పాల్ సర్జియంట్, లిల్లీ హ్యుయిన్, జెర్జీ ఫ్లెచర్, జాయ్ రోక్సాస్)
ఇవి కూడా చదవండి:
- Fake Newsపై అవగాహన కల్పించే కథనాలు మీ కోసం
- నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- 'రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- 'మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)