కరోనా: చైనాకు మోదీ గ్రీన్ సిగ్నల్.. మోసపోయిన దేశాలు.. మొత్తం 36వేల మంది బలి..
చూడబోతే ప్రపంచ దేశాలకు మళ్లీ చైనానే దిక్కయ్యే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ పుట్టినిల్లుగానే తీవ్ర ఆరోపణలు, చీత్కారాలు ఎదుర్కొన్న చైనా.. వైరస్ వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోవడమేకాదు.. ఆ పనిలో ప్రపంచ దేశాలకూ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. అయితే చైనాను నమ్మి కొన్ని దేశాలు దారుణంగా మోసపోయిన నేపథ్యంలో చైనా సాయంపై భారత్ ఆచితూచి స్పందించింది.
మన దేశంలో మరణాలు రేటు తక్కువే
ఇండియాలో సోమవారం రాత్రి నాటికి కొవిడ్-19 పేషెంట్ల సంఖ్య 1318కి పెరిగింది. కేరళ, మహారాష్ట్రలో ఇప్పటికే కేసుల సంఖ్య 200 దాటగా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటకలో పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 100కు చేరువైంది. దేశవ్యాప్తంగా మొత్తం 34 మంది చనిపోయారు. కొత్త కేసుల నమోదు రేటుతోపాటు మిగతా దేశాలతో పోల్చుకుంటే మరణాల రేటు మనదగ్గర స్వల్పంగా ఎక్కువ ఉంది. దీనికితోడు వైద్య పరికారాల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీంతో కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
సాయంగా వద్దు..
కరోనా చికిత్సకు కీలకం కావడంతో భారత్ కు అవసరమైన వెంటిలేటర్లు, వైద్య సిబ్బంది కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్వీప్మెంట్(పీపీఈ), మాస్కులు, ఐ గేర్స్ తదితర వస్తువుల్ని చైనా నుంచి రప్పించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు దిగుమతుల కోసం చైనీస్ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ వస్తువులను సహాయం కింద తీసుకోవడం లేదని, ప్రతి దానికీ పైసలు చెల్లిస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం.
ఆ ఒక్కటీ తప్ప..
చైనా నుంచి వెంటిలేటర్లు, పీపీఈలు, మాస్కులు తెప్పిస్తోన్న మోదీ సర్కారు.. కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లను మాత్రం లిస్టు నుంచి తొలగించింది. ఎందుకంటే చైనా తయారు చేసిన వైరస్ టెస్టింగ్ కిట్లు సరిగా పనిచేయని కారణంగానే యూరప్, అమెరికా దేశాల్లో వైరస్ విజృంభించింది. తాము మోసపోయినట్లు ఆయా దేశాలు బాహాటంగానే చైనాను విమర్శించాయి. దీంతో కిట్స్ రీప్లెస్ మెంట్ చేస్తామని చైనీస్ కంపెనీలు ముందుకొచ్చినా ఎవరూ నమ్మలేదు. ఆ అనుభవాల దృష్ట్యా భారత్.. చైనిస్ టెస్టింగ్ కిట్ల జోలికి పోలేదు.
Recommended Video
35 వేలు దాటిన మరణాలు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య సోమవారం నాటికి కేసుల సంఖ్య 7.5లక్షలుగా నమోదైంది. ఇప్పటికే మరణాల్లో చైనాను అధిగమించిన స్పెయిన్.. పాజిటివ్ కేసుల విషయంలోనూ డ్రాగెన్ దేశాన్ని దాటేసింది. చైనాలో కొత్తగా కేవలం 30 కేసులతో మొత్తంగా 81 వేల పాజిటివ్ లు ఉండగా, స్పెయిన్ లో మాత్రం 5వేలకు పైగా కొత్త కేసులతో మొత్తం 86 వేల పాజిటివ్ లు ఉన్నారు. అమెరికా 1.5 లక్షల కేసులతో అమెరికా టాప్ లో నిలిచింది. అక్కడ 2,616 మంది చనిపోయారు. మరణాల విషయంలో ఇటలీలో అత్యధికంగా 11,600 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఇప్పటికీ 1లక్షకుపైగా పాజిటివ్ పేషెంట్లున్నారు.