Coronavirus:బెంగళూరు ఐటీ కంపెనీల ఉద్యోగులు విదేశాలకు వెళ్లకూడదు, ప్రభుత్వం ఆర్దర్ !
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID 19) దెబ్బకు కర్ణాటక ప్రభుత్వం హడలిపోయింది. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో బెంగళూరు సాఫ్ట్ వేర్ కంపెనీలు (ఐటీ) వారి ఉద్యోగులను విదేశాలకు పంపించరాదని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి రోగుల సంఖ్య ఎక్కువ అవుతోందని, ఇలాంటి సమయంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు వారి ఉద్యోగులను విదేశాలకు పంపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలా చేస్తే అందరికీ మంచిదని ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు.
కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు మందు కనిపెట్టిన సీఎం ఇబ్రహీం, చెప్పింది చెయ్యండి, రింగ్ టోన్ కాదు !
ఐటీ కంపెనీల వివరాలు చెప్పండి
బెంగళూరు నగరంలోని సాఫ్ట్ వేర్ కంపెనీలు గత ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మీ కంపెనీ ఉద్యోగులు ఎవరెవరు విదేశాలకు వెళ్లి వచ్చారో అనే పూర్తి వివరాలు ఇవ్వాలని కర్ణాటక ఆరోగ్య శాఖ సూచించింది. మీ కంపెనీల ప్రతినిధులు కరోనా వైరస్ వ్యాధి వ్యాపించిన దేశాలకు వెళ్లారా ? లేక ఆదేశాల నుంచి తిరిగి బెంగళూరు వచ్చారా ? అనే పూర్తి సమాచారం మాకు ఇవ్వాలని ఆరోగ్య శాఖ సూచించింది.
రూ. 10, 290 కోట్ల వ్యాపారం
రూ. 10, 290 కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీల మీద కరోనా వైరస్ దెబ్బ బలంగా పడుతోందని సమాచారం. ప్రపంచ దేశాల్లోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు మూడో స్థానంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ దెబ్బ బెంగళూరు సాఫ్ట్ వేర్ కంపెనీల మీద పడే అవకాశం ఉందని తెలిసింది.
40. 87 లక్షల మంది విదేశాలకు !
బెంగళూరు నగరంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. బెంగళూరు నగరంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 2019 సంవత్సరంలో సాఫ్ట్ వేర్ కంపెనీలకు చెందిన 40 లక్షల 87 వేల మంది ఉద్యోగులు విదేశాలకు వెళ్లి వచ్చారని సంబంధిత అధికారుల దగ్గర ఉన్న లెక్కలు చెబుతున్నాయి.
డెల్, మైండ్ ట్రీ ఉద్యోగులకు కరోనా వైరస్
ప్రసిద్ది చెందిన డెల్ ఇండియా, మైండ్ ట్రీ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని ఆ కంపెనీలు ప్రకటించాయి డెల్ ఉద్యోగి అమెరికాలోని టెక్సాస్ నుంచి భారత్ వచ్చారని, మైండ్ ట్రీ కంపెనీ ఉద్యోగి కూడా విదేశాలకు వెళ్లి వచ్చారని ఆ కంపెనీలు తెలిపాయి. రెండు కంపెనీల ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని నిర్థారణ అయ్యింది. ఇద్దరితో పాటు వారి కుటుంబ సభ్యులను నిర్బంధించి మెరుగైన చికిత్స అందిస్తున్నారని డెల్ ఇండియా, మైండ్ ట్రీ కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ ఇద్దరు ఉద్యోగులు ఆఫీసు పని మీద విదేశాలకు వెళ్లి వచ్చారని ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
నోటీసులపై ఐటీ కంపెనీల క్లారిటీ !
సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు విదేశాలకు వెళ్లి రాకూడదని కర్ణాటక ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని గురువారం ఐటీ, బీటీ కంపెనీల డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. ఐటీ కంపెనీల ఉద్యోగులు విదేశాలకు వెళ్లకూడదని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాలు వస్తే తప్పకుండా పాటిస్తామని ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు.