కరోనాపై కేంద్రం సంచలన ప్రకటన.. 10 లక్షల మందికి టెస్టులు.. నిర్బంధంలో 26వేల మంది..
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించనప్పటికీ.. అంతకంటే పకడ్బందీగా, పక్కా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాలు కొవిడ్-19(కరోనా వైరస్)పై పోరాడుతున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్.. కరోనాపై చర్చించింది. కరోనాను నిరోధించే మార్గం లేనందున సాధ్యమైనంత వరకు దాన్ని నివారించే మార్గాలపైనే దృష్టిసారించాలని ప్రధాని సూచించారు. కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మారుమూల గ్రామాలకూ వైరస్?
గత మూడ్రోజులుగా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని, అన్ని రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నామని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చినవాళ్లు కాకుండా.. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లోని 10 లక్షల మందికి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కింలో నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో భయాందోళనలు నెలకొనడంతో ఈ మేరకు టెస్టులు చేపట్టామన్నారు. ఇక యాక్టివ్ కేసుల విషయానికొస్తే..
ఎంతమంది అనుమానితులంటే..
స్క్రీనింగ్ టెస్టుల్లో చాలా వరకు ఫలితాలు నెగటివ్ గానే వచ్చాయన్న మంత్రి.. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులుగా అనుమానిస్తోన్నవాళ్లు 26వేల మంది ఉన్నారని, నిర్బంధం తరహాలో వాళ్లందరినీ ఇళ్లు కదలనీయకుండా ఉంచామని తెలిపారు. బుధవారం నాటికి సీరియస్ కేసులుగా పరిగణించిన 3,245 మందికి పుణె, ఇతర వైరాలజీ ల్యాబుల్లో టెస్టులు చేయగా.. 28 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని మంత్రి వివరించారు. మరికొన్ని కేసులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందన్నారు.
కీలక ఆదేశాలు..
కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్.. ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ లోని సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఢిల్లీ, నోయిడాలో వైరస్ భయాలు పెరిగిపోవడం, నాలుగు స్కూళ్లకు 14 రోజులపాటు సెలవులు ప్రకటించడం తదితర పరిణామాలపై మంత్రి ఆరాతీశారు. ఎక్కువ సార్లు సబ్బుతో చేతులు కడుక్కోవడం, తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు రుమాలు అడ్డంగా పెట్టుకోవడం, వీలైనంతమేరకు సమూహాలకు దూరంగా ఉండటం ద్వారా కరోనా ప్రమాదాన్ని నివారించొచ్చని, ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
Recommended Video
పండుగను జరుపుకోబోనన్న ప్రధాని..
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ ఈఏడాది హోలి పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ‘‘కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే జనసమూహాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఏడాది నేను హోలి మిలాప్ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు''అని మోదీ ట్వీట్ చేశారు. మోదీతోపాటే తాము కూడా దూరంగా ఉంటామని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పేర్కొన్నారు.