తొలి ఫలితాల్లో కుమ్మేస్తోన్న బీజేపీ-శివసేన: గ్రేటర్ ముంబైలో తొలి ఫలితం
Recommended Video
ముంబై: ముందుగా అంచనా వేసినట్లే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. తొలి ఫలితాల్లో భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో వెలువడిన ఫలితాలు బీజేపీ-శివసేన వైపు మొగ్గు చూపాయి. కాంగ్రెస్, ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వెనుకంజలో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో వెలువడిన అంచనాలను బట్టి చూస్తే.. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రారంభంలో వచ్చిన ఇవే ఫలితాలు చివరి దాకా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.
దేవేంద్ర ఫడణవీస్ ముందంజ
బీజేపీ ఎన్నికల తురుఫుముక్క, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముందంజలో ఉన్నారు. నాగ్ పూర్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. తొలి రౌండ్ లో తన ప్రత్యర్థి, సమీప ఎన్సీపీ అభ్యర్థిపై సుమారు వెయ్యి కోట్లకు పైగా మెజారిటీని సాధించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా ముందంజలో ఉన్నారు. నాందెడ్ జిల్లాలోని భోకర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. వారితో పాటు- శివసేన తరఫున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య థాక్రే లీడింగ్ లో ఉన్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆదిత్య థాక్రే ముందంజలో కొనసాగుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు లీడింగ్ లో..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు అమిత్ దేశ్ ముఖ్ లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఆయన లాతూర్ సిటీ స్థానం నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థిపై అమిత్ దేశ్ ముఖ్ తొలి ఫలితాల్లో మెజారిటీలో కొనసాగుతున్నారు. ఎన్సీపీ సుప్రిమో శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ సైతం ముందంజలో ఉన్నారు. బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. శరద్ పవార్ కుటుంబానికే చెందిన రోహిత్ పవార్ మాత్రం వెనుక బడ్డారు. కర్జత్ జమ్ ఖండీ నుంచి ఆయన పోటీ చేశారు.
హర్యానాలో బీజేపీ లీడింగ్..
షోలాపూర్ సిటీ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణితి షిండే వెనుకంజలో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. షోలాపూర్ సుశీల్ కుమార్ షిండేకు కంచుకోటలాంటిది. కాగా.. హర్యానాలో కూడా బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. కర్నాల్ వంటి పలు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. బీజేపీ ఇక్కడ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.