క్షుద్ర పూజలు: గొంతులు కోసి దంపతుల దారుణ హత్య
పాట్నా: మంత్రాలు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని దంపతుల మీద కక్ష పెంచుకున్న గ్రామస్తులు ఇద్దరిని ఒకే సారి దారుణంగా హత్య చేశారు. తమకు ఏమీ తెలియదని దంపతులు చెబుతున్నాపట్టించుకోకుండా ఇద్దరిని అతి కిరాతకంగా చంపేశారు.
బీహార్ లోని గయా జిల్లాకు 100 కిలో మీటర్ల దూరంలో పతారా గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాంకీ మాంఝీ, లక్ష్మి దేవి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులు అప్పుడప్పుడు మంత్రాలు వేస్తుంటారని, అమావాస్య రోజు క్షుద్ర పూజలు చేస్తుంటారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై గ్రామస్తులు దంపతుల మీద అనుమానం పెంచుకున్నారు. గ్రామంలో ఎవ్వరు అనారోగ్యానికి గురి అయినా వీరే చేతబడి చేసి ఉంటారని భావించేవారు. ఈ దంపతులతో గ్రామస్తులు ఎక్కవగా మాట్లాడేవారు కాదని, పట్టించుకునే వారు కాదని సమాచారం.
జంకీ మాంఝీ పక్కింటిలో సోహరాయ్ మాంఝీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇతని ఇంటిలో ఇద్దరు అనారోగ్యానికి గురైనారు. జాంకీ దంపతులు మంత్రాలు వెయ్యడం వలనే తమ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనారని అతను కక్ష పెంచుకున్నాడు.
శుక్రవారం రాత్రి పోద్దు పోయిన తరువాత సోహరాయ్ తన అనుచరులతో కలిసి జాంకీ ఇంటిలోకి చొరబడ్డాడు. తరువాత జాంకీ మాంఝీ, లక్ష్మిదేవి దంపతుల గొంతులు కోసి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
జాంకీ మాంఝీ, లక్ష్మిదేవి దంపతులను సోహరాయ్, అతని అనుచరులు హత్య చేశారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ధనంజయ్ కుమార్ అన్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో 1999 చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయించాలని బీహార్ మానవహక్కుల కమిషన్ ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.