ఆత్మీయుల చివరి చూపూ దక్కనివ్వని కరోనా వైరస్: మృతదేహాల అంత్యక్రియల కోసం గైడ్లైన్స్..!
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని బలి తీసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికా సహా చైనా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందినట్టుగా పేరున్న అమెరికాలోనే కరోనా వైరస్ మృతుల సంఖ్య వందకుపైగా నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల 8127 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య రెండు లక్షలకు దాటిపోవడంతో మరణాల సంఖ్య ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు.
ఇన్నాళ్లూ ఎన్నికల హడావుడిలో మునిగి తేలి..ఇక కరోనాపై: మంత్రులతో టాస్క్ఫోర్స్: ఢిల్లీలో సాయిరెడ్డి..
ప్రత్యేక మార్గదర్శకాలు జారీ..
మనదేశంలోనూ ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. వైరస్ అనుమానితుల సంఖ్య 150ని దాటింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. మృతదేహాల అంత్యక్రియలపై కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆదేశించింది. ఐసొలేషన్ వార్డు లేదా క్వారంటైన్లో మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం దగ్గరి నుంచి వాటి తరలింపు, కుటుంబ సభ్యులకు అందజేయడం.. అంత్యక్రియల నిర్వహణ వంటి చర్యలను ఏరకంగా చేపట్టాలనే విషయాలను ఈ మార్గదర్శకాల్లో సమగ్రంగా పొందుపరిచింది.
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..
కరోనా వైరస్ పేషెంట్ మరణించిన తరువాత.. ఆ మృతదేహాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలనే విషయంపై సంబంధిత సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఐసొలేషన్ ప్రదేశం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం, మార్చురీకి తీసుకెళ్లడం, అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా స్మశానానికి తరలించడం.. వంటి కార్యక్రమాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ మృతదేహం నుంచి వైరస్ మరొకరికి సోకకుండా ఉండటానికి కొన్ని కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.
Recommended Video
ప్లాస్టిక్ బ్యాగుల్లోనే..
మృతదేహాన్ని నిర్దేశించిన ప్లాస్టిక్ బ్యాగుల్లోనే తరలించాల్సి ఉంటుందని పేర్కొంది. మతపరమైన ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించింది. మృతదేహంపై దండలు వేయకూడదని, తల నుంచి చిటికెన వేలి వరకు బయటికి కనిపించని విధంగా మృతదేహాన్ని కప్పేయాల్సి ఉంటుందని కేంద్రం తన మార్గదర్శకాల్లో పొందుపరిచింది. చితిపై మృతదేహాన్ని దహించి వేయాల్సిన వారు.. దీనికోసం కొన్ని నిబంధనలను ప్రత్యేకంగా పాటించాల్సి ఉంటుందని సూచించింది. డాక్టర్ల సూచనల మేరకే బూడిదను సేకరించాలని స్పష్టం చేసింది.