భారత్లో కరోనా విలయం -ఒక్కరోజే 131 మంది మృతి -కొత్తగా 24,492 కేసులు
సర్వత్రా అలసత్వం ఆవహించిన వేళ కరోనా మహమ్మారి నిశబ్దంగా వ్యాప్తి చెందుతోంది. భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించిన దరిమిలా, విపత్తును ఎలా అధిగమించాలనేదానిపై కేంద్రం అలర్టయింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమావేశం కానున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 8.73లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, 24,492 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 131 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,58,856కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది.
కొత్తగా 20,191 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,27,543కు చేరింది. కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రికవరీ రేటు క్రమంగా పడిపోతూ 96.65కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,23,432కి పెరిగింది.
కొత్తగా నమోదవుతోన్న కేసుల్లో మహారాష్ట్ర నుంచే ఎక్కువగా వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 15వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస వ్యాప్తి కొనసాగుతున్నా, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు పోతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 3,29,47,432కి చేరింది.












Click it and Unblock the Notifications