కొవిడ్-19: ప్లాస్మా థెరపీపై కేంద్రం ట్విస్ట్.. 24 గంటల్లో 1594 కొత్త కేసులు..
ఇంకో ఐదు రోజుల్లో లాక్ డౌడ్ గడువు పూర్తికావస్తుండగా, దేశంలో వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గకపోగా, గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 1594 కేసులు పుట్టుకొచ్చాయి. మంగళవారం సాయంత్రానికి కొవిడ్-19 మొత్తం కేసుల సంఖ్య 29,974కు పెరిగింది. అందులో 23.3 శాతం రికవరీరేటుతో ఇప్పటికే 7,027 మంది డిశ్చార్జి అయిపోగా, మరణాల సంఖ్య 937కు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బ్రీఫింగ్ లో ఈ విషయాలను వెల్లడించింది. అలాగే, ప్లాస్మా థెరపీపైనా కీలక సూచనలు చేసింది.

ప్లాస్మాతో ప్రాణాపాయం..
కొవిడ్-19 వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో అన్ని చోట్లా ప్రత్యామ్నాయ మార్గాల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. మనదేశంలో కొంతకాలంగా ప్లాస్మా థెరపీ పాపులర్ అవుతూ వచ్చింది. కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల నుంచి రక్తం సేకరించి, ప్లాస్మాను వేరుచేసి. దాన్ని క్రిటికల్ కండిషన్ లోని పేషెంట్లకు అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టారు. ఒక దశలో ప్లాస్మా దానాలు చేయాలంటూ ప్రభుత్వాలు సైతం పిలుపునిచ్చాయి. అయితే, మంగళవారం నాటి మీడియా సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్.. ప్లాస్మా థెరపీతో ప్రాణాపాయం తలెత్తొచ్చని హెచ్చరించారు.

ట్రీట్మెట్గా నిర్ధారించలేదు..
‘‘ప్లాస్మా థెరపీతో కొవిడ్-19 వ్యాధి తగ్గిపోతుందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాన్ని ప్రయోగంగానే భావించాలి తప్ప, ట్రీట్మెంట్ గా ఇంకా నిర్దారించలేదు. ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ సైంటిస్టులు జాతీయ స్థాయిలో అధ్యయనం చేస్తారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే ప్లాస్మా పనితీరుపై సైంటిఫిక్ ప్రూఫ్ లభించే అవకాశముంది. సరైన విధానంలో, నిపుణుల పర్యవేక్షణ లేకుండా ప్లాస్మా థెరపీ చేస్తే రోగి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఈ థెరపీ విషయంలో చలా జాగ్రత్తగా ఉండాలి''అని అగర్వాల్ హెచ్చరించారు.
Recommended Video

గుజరాత్ పై స్పెషల్ రిపోర్ట్..
కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర(8,590కేసులు) తర్వాత గుజరాత్ 3,548 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. అక్కడి అహ్మదాబాద్, సూరత్ సిటీల్లో ఊహించనంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందడంతో అసలేం జరిగిందో పరిశీలించేందుకు కేంద్రం.. వివిధ శాఖల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సదరు కమిటీ రూపొందించిన రిపోర్టు వివరాలను అగర్వాల్ వెల్లడించారు. లాక్ డౌన్ ఆదేశాలకు విరుద్ధంగా ఆయా సిటీల్లో ట్రైనింగ్ సెంటర్లు నడపడం వల్లే వ్యాపించిందని చెప్పారు. ప్రస్తుతం సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల పర్యవేక్షణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్నామన్నారు.

హోం ఐసోలేషన్ ఇలా..
కరోనా వైరస్ సోకినవాళ్ల హోం ఐసోలేషన్ కు సంబందించి కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. చాలా తేలికపాటి కొవిడ్-19 లక్షణాలున్న రోగులు లేదా ప్రీ-సింప్టమాటిక్(రోగలక్షణాలు ఇంకా బయటపడనివాళ్లు) తమ సొంత ఇళ్లలో స్వీయ ఐసోలేషన్ లో ఉండేందుకు కేంద్రం అనుమతించింది. ప్రత్యేక గదుల సౌకర్యంలేనివాళ్లు మాత్రం కచ్చితంగా ఆస్పత్రుల్లోనే ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications