కరోనా విలయం: మే 17 వరకు లాక్డౌన్.. అనూహ్య నిర్ణయానికి కారణాలివే.. జాతికి సందేశమివ్వనున్న ప్రధాని..
కరోనా వైరస్ కు సంబంధించి ఇప్పటిదాకా ఒక్క శుభవార్త కూడా కన్ఫామ్ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు సంఖ్య 33లక్షలు దాటగా, అందులో 10లక్షల మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 2.35లక్షలకు పెరిగింది. మన దేశంలో కేసుల సంఖ్య 35వేల మార్కును దాటింది. మరణాలు 1200కు చేరువయ్యాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ దేశమైన అమెరికాలో కేసులు 11 లక్షలకు, మరణాలు 64వేలకు చేరినా, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోడానికి అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసింది. యూరప్ దేశాలు కూడా రిలాక్సేషన్ల బాటపట్టాయి. అదే క్రమంలో ఇండియాలోనూ లాక్ డౌన్ ఎత్తివేత ఖాయమనే భావన వ్యక్తమైంది. కానీ..
Recommended Video

జాతికి మోదీ సందేశం..
దేశవ్యాప్త లాక్ డౌన్ మే 3తో ముగియనుండటంతో దాన్ని మరో రెండు వారాలపాటు, అంటే మే 17 వరకు పొడగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై ప్రధాని మోదీ శుక్రవారం వివిధ శాఖలతో భేటీ నిర్వహించారు. అది ముగిసిన కొద్దినిమిషాల్లోనే లాక్ డౌన్ పొడగింపు ఆదేశాలు వెలువడ్డాయి. మార్చి 24న మొదటిసారి లాక్ డౌన్ విధింపు, ఏప్రిల్ 14 తర్వాత రెండో దశ పొడగింపుపై ప్రధాని నేరుగా ప్రకటనలు చేసిన తర్వాతే కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కానీ మూడో దశ పొడగింపుపై కేంద్ర హోం శాఖ ముందుగానే ఆదేశాలివ్వగా, మోదీ ఆలస్యంగా జనం ముందుకొస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతారని కేంద్ర వర్గాలు తెలిపాయి.

తలకిందులైన అంచనాలు..
నాలుగు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో.. మెజార్టీ రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తివేతకు డిమాండ్ చేసిన తర్వాత ఎగ్జిట్ తప్పదనే భావన వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా కేవలం ఆరుగురు సీఎంలు మాత్రమే లాక్ డౌన్ కొనసాగింపునకు మొగ్గుచూపినట్లు స్వయంగా ప్రధాని కార్యాలయమే ప్రకటన చేయడం తెలిసిందే. కానీ, శుక్రవారం నాటి హోంశాఖ ప్రకటనతో లాక్ డౌన్ కు సంబంధించి ఇటీవల వెల్లడైన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రైళ్లు, విమానాలు, రోడ్డ రవాణా, విద్యా సంస్థలు, మాల్స్, పబ్లిక్ గ్యాదరింగ్స్ పై నిషేధాన్ని యధావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ, జోన్లవారీగా మరికొన్ని సడలింపులు కల్పించడం ఒక్కటే ఈసారి ఊరటనిచ్చింది.

కారణాలు ఒకే కానీ..
లాక్ డౌన్ కొనసాగింపునకు గల కారణాలను ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించానున్నారు. ప్రధానంగా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా అదుపులోకి రాకపోవడం, కేసుల పరంగా ఇంకా పీక్ దశను దాటనందువల్లే లాక్ డౌన్ పొడగింపునకు మోదీ మొగ్గుచూపారని కేంద్ర వర్గాలు తెలిపాయి. అయితే, మే 4 తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎకనామిక్ యాక్టివిటీలు పునరుద్ధరిస్తామన్న ముఖ్యమంత్రులు.. కేంద్రం నిర్ణయంపై ఎలా స్పందింస్తారనేదానిపై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే రెడ్ జోన్ల విషయంలో కేంద్రం, వెస్ట్ బెంగాల్ మధ్య రగడ జరుగుతోన్న నేపథ్యంలో మూడో దశ లాక్ డౌన్ లో.. రాష్ట్రాలకు మరిన్ని వెసులుబాట్లు కల్పించడాన్ని మిగతా సీఎంలు స్వాగతిస్తారో లేదో వేచిచూడాలి.

మోదీ ఎగ్జిట్ కసరత్తు..
లాక్ డౌన్ పొడగింపు ప్రకటన వెలువడటానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై కీలక భేటీ నిర్వహించారు. అందులో కేంద్ర మంత్రులు అమిత్ షా, పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్ తోపాటు కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా తదితులు పాలుపంచుకున్నారు. గతంలో సీఎంలు వెలిబుచ్చిన అభిప్రాయాలను బేరీజు వేసుకుంటూనే లాక్ డౌడ్ పొడగింపుపై మోదీ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఎగ్జిట్ స్ట్రాటజీలో భాగమేనని, రెడ్ జోన్లలో వచ్చే 14 రోజుల పాటు కేసుల నమోదు తగ్గితే వాటిని ఆరెంజ్ జోన్లుగా మార్చుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించారు.












Click it and Unblock the Notifications