గోమూత్రం తాగబట్టే కరోనా సోకలేదు -దారితప్పిన జనం వల్లే ఆక్సిజన్ కొరత -బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా చమక్కులు
ఉగ్రవాదం కేసుల్లో నిందితురాలైన భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచారు. బాబు పేలుళ్ల కేసుల్లో తనను ఇరికించిన ఐపీఎస్ ఆఫీసర్లు పాక్ ఉగ్రవాదుల చేతుల్లో కుక్కచావు చచ్చారని, పోలీసులు కొట్టిన దెబ్బల నుంచి కోలుకోడానికి గోమూత్రం దివ్యఔషధంగా పనిచేసిందని, రోజూ గోమాతను వాటేసుకుని, మూత్రం సేవించడం వల్లే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని జయించగలిగానంటూ గతంలో పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె తాజాగా కోరనా విలయం, ఆక్సిజన్ కొరతపైనా చమక్కులు వదిలారు..
tirumala: బిచ్చగాడి ఇంట్లో రూ.10లక్షలు -అంతా స్వాధీనం చేసుకున్నTTD - అసలేం జరిగిందటే..
కరోనా విలయకాలంలో సొంత నియోజకవర్గ ప్రజలకు కనిపించకుండా పోయారంటూ ఎంపీ ప్రగ్యా సింగ్ పై ఆ మధ్య భోపాల్ అంతటా పోస్టర్లు వెలియగా, ప్రస్తుతం సిటీలోనే ఉన్న ఆమె రోజువారీగా కొవిడ్ పరిస్థితుల్ని సమీక్షిస్తూ, ప్రజలకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఆ క్రమంలోనే సోమవారం భోపాల్ లోని హెగ్డేవార్ ఆస్పత్రికి ఎంపీ ప్రగ్యా 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వితరణగా అందించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ కొరతపై, కరోనాపై పోరాటంపై ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దారి తప్పిన కొందరు ప్రజలు.. ఇష్టారీతిగా చెట్లను కొట్టేయడం వల్లే దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, ప్రస్తుత విలయానికి కారమంటూ ఎవరైనా ఉన్నారంటే అది చెట్లను కొట్టేవారేనని ఎంపీ ప్రగ్యా సింగ్ అన్నారు. తులసి, మర్రి, వేప లాంటి వృక్షజాతులను పెంచితే అవి 24 గంటలూ ఆక్సిజన్ అందిస్తాయని, ప్రతి కుటుంబం విధిగా కనీసం 10 మొక్కలు నాటాలని, చెట్లను కుటుంబీకులుగా భావించి జాగ్రత్తగా పెంచాలని, తన వంతుగా భోపాల్ నియోజకవర్గంలో 1కోటి మొక్కలను నాటిస్తానని సాధ్వి చెప్పుకొచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, కొవిడ్ విషయానికొచ్చేసరికి ఎంపీ గతితప్పినట్లుగా..
కరోనా వైరస్ కు విరుగుడు ఒక్క గోమూత్రమేనని బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సెలవిచ్చారు. ''మనం గోమూత్రం తీసుకున్నట్లైతే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి ఎలాంటి జబ్బులు రావు. గోమూత్రం రోజూ తీసుకునే వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రతిరోజు దానిని తాగుతాను కాబట్టే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కరోనా కూడా రాకపోవడానికి కారణం గోమూత్రమే''అని ఎంపీ చెప్పారు. కొద్ది నెలల కిందట ఆమె కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరడం, ఆరోగ్యం బాగోని కారణంగా మాలేగావ్ పేలుళ్ల కేసు వాయిదా పడటం తెలిసిందే.
ఎంపీ రఘురామ వివాదంలో మరో ట్విస్ట్ -జగన్ సర్కారుపై సుప్రీంకోర్టుకు ఆ రెండు ఛానళ్లు -ఎదురుదెబ్బ?
Recommended Video
మధ్యప్రదేశ్ లో సోమవారం ఒక్కరోజే కొత్తగా 5821 కేసులు, 77మరణాలు నమోదయ్యాయి. సాధ్వి ప్రగ్యా ప్రాతినిధ్యం వహిస్తోన్న భోపాల్ లో కొవిడ్ మరణాలకుతోడు బ్లాక్ ఫంగస్ మరణాలు పెరగడం ఆందోళనకరంగా మారింది. ఆవు పేడ గానీ, గోమూత్రం గానీ కోవిడ్ రాకుండా చూస్తాయని లేదా వచ్చిన తర్వాత నయం చేస్తాయనడానికి శాస్త్రీయమైన ఆధారాలేవీ లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అనేకసార్లు హెచ్చరించినా బీజేపీ నేతలు మాత్రం అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎంపీ సాధ్వి ప్రగ్యా కంటే ముందు యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ గోమూత్రంపై డెమో వీడియో విడుదల చేయడం తెలిసిందే. ప్రధాని మోదీ ఇలాకా గుజరాత్ లో స్వామి నారాయణ్ గురుకుల్ విశ్వవిద్యా ప్రతిష్టానం ప్రాంగణంలో కరోనా విరుగుడుకు చేపట్టిన ఆవు పేడ థెరపీ విశ్వవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే.