సంచలన వీడియో; మమ్మల్ని కాపాడండి: వేడుకున్న బీజేపీ నేత కుమార్తె!(వీడియో)
Recommended Video
తిరువనంతపురం: కేరళలో ఎర్రన్నలకు.. కాషాయ దళానికి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీపీఎం కార్యకర్తల మూలంగా తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందంటూ ఓ బాలిక వీడియో తెర పైకి రావడం ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం లేపుతోంది. సీపీఎం బెదిరింపులకు పాల్పడుతోందంటూ సోషల్ మీడియాలో బాలిక పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది.
ఏం జరిగింది:
కసరగాడ్ జిల్లాకు చెందిన సుకుమారన్ అనే సీపీఎం కార్యకర్త.. ఇటీవలే పార్టీని వీడారు. పార్టీ తనను గుర్తించట్లేదన్న అసంతృప్తితో బీజేపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే సీపీఎం సుకుమారన్పై కక్ష గట్టిందనేది అతని కుమార్తె అశ్విని ఆరోపణ. ఇదే విషయాన్ని ఆమె వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
చంపుతామని బెదిరించినట్టు ఆరోపణ..:
గురువారం తన కూతురును స్కూల్ నుంచి తీసుకొస్తున్న క్రమంలో సుకుమారన్ను ఐదుగురు సీపీఎం కార్యకర్తలు అడ్డగిచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. సుకుమారన్ కుటుంబాన్ని చంపుతామని, పోలీసులు కూడా తమనేమి చేయలేరని వాళ్లు హెచ్చరించినట్టుగా చెబుతున్నారు. ఈ విషయాలన్నింటిని సుకుమారన్ కుమార్తె ఫేస్బుక్లో పోస్టు చేయడం గమనార్హం.
మమ్మల్ని కాపాడండి..:
'స్కూల్కు వెళ్లాళ్లన్నానాకు భయంగా ఉంది.. దొడ్డిదారిలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. సీపీఎం కార్యకర్తలు నా తండ్రిని చంపేస్తారు.. నా కుటుంబాన్ని రక్షించండి' అంటూ బాలిక వీడియోలో ఆవేదనవ వ్యక్తం చేసింది.
ఖండించిన సీపీఎం:
'సుకుమారన్ లాంటి చిన్న స్థాయి వ్యక్తిని మేమెందుకు బెదిరిస్తాం. ఆ అవసరమేంటి?.. సీపీఎంలో అతనో సాధారణ కార్యకర్త. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్లాడు. పబ్లిసిటీ కోసమే ఈ ఆరోపణలన్ని చేయిస్తున్నాడు' అని సీపీఎం కొట్టిపారేసింది.
బీజేపీ వాదన:
మరోవైపు సుకుమారన్ బలమైన నేత అని బీజేపీ చెబుతోంది. కాబట్టే అతనికి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. బెదిరింపుల వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని ధర్నా కూడా చేపట్టింది. సుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.