15 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన బీజేపీ-షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో 75 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అత్యధిక మంత్రులకు నేరచరిత్ర ఉన్నట్లు తెలిపింది. వీరిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు 2019 ఎన్నికల సమయంలో వారే తమ ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా పేర్కొన్నారని తెలిపింది.
శివసేనలో తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ సంక్షోభం పరిణామాల నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 30న వీరు ప్రమాణ స్వీకారం చేయగా 40 రోజుల తర్వాతకానీ కొత్త మంత్రులు కొలువుదీరలేదు. ఈనెల 9వ తేదీన తొలిసారిగా మంత్రివర్గాన్ని విస్తరించారు. కానీ వీరికి ఇంకా శాఖలను కేటాయించలేదు. 20 మందిలో 15 మందిపై క్రిమినల్ కేసులున్నాయని నివేదికలో వెల్లడించారు. 13 మందిపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులున్నాయి.
షిండే కేబినెట్ లో మంత్రులంతా కోటీశ్వరులే. మలబార్ హిల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళ్ ప్రభాత్ లోధా అత్యంత ధనిక మంత్రిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.441.65 కోట్లుగా ఉంది. పైథాన్ నియోజకవర్గానికి చెందిన భూమారే సందీపన్ రావు ఆసారం తక్కువ ఆస్తితో రూ.2.92 కోట్లుగా ఉంది. వీరి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదు. 8 మంది మంత్రులు 10, 12 తరగతుల వరకు చదివారు. ఒక మంత్రి డిప్లమో చేశారు. 11 మంది మంత్రులు గ్రాడ్యుయేషన్, ఆపై వరకు చదివారు. 41 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్నవారు నలుగురున్నారు. మిగిలినవారంతా 50 నుంచి 70 సంవత్సరాల్లోపు వయసున్నవారు.