ఏపీపైనా అసని తుఫాను ఎఫెక్ట్: ఒడిశా అలర్ట్, కోల్కతాతోపాటు బెంగాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు
న్యూఢిల్లీ: దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని, మే 10న ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృతుంజయ్ మహాపాత్ర తెలిపారు. మహాపాత్ర ప్రకారం.. అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది.
తుఫానుగా అల్పపీడనం.. పశ్చిమ బెంగాల్లో ఉరుములు, భారీ వర్షాలు
ఆదివారం సాయంత్రం నాటికి అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ కార్యాలయం ప్రకారం.. తుఫాను ఏర్పడే అవకాశం ఉన్నందున, మే 10, 13 (మంగళవారం, శుక్రవారం) మధ్య గంగా పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తుఫానుకు అసని అని పేరు పెట్టింది శ్రీలంక.. అసని అంటే కోపం
ఈ వ్యవస్థ తుఫాన్గా మారితే, దానిని అసని అని పిలుస్తారని, దీనికి శ్రీలంక పెట్టిన పేరు అని టెలిగ్రాఫ్ నివేదించింది. సింహళ భాషలో అసని అంటే కోపం అని అర్థం. కోల్కతాతో సహా గంగా బెంగాల్లో మే 10, 13 తేదీల మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 10 నుంచి కోల్కతాలో శక్తివంతమైన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ప్రభావం తుఫాను గమనంపై ఆధారపడి ఉంటుంది.
ఏపీ, ఒడిశాలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు, మత్స్యకారులకు హెచ్చరిక
ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. "ఇది మే 10 సాయంత్రం వరకు వాయువ్య దిశలో కదులుతుందని భావిస్తున్నారు, ఆ తర్వాత ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో వాయువ్య బంగాళాఖాతం వైపు కదులుతుంది" అని ఆయన తెలియజేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. కాగా, మే 10 నుంచి ఒడిశా మీదుగా ఉత్తర ఆంధ్ర ప్రదేశ్లో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. చురుకైన పరిస్థితుల కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఒడిశా, ఉత్తర ఆంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రభావితమవుతుందని వెల్లడించారు.
అసని తుఫానుతో ఒడిశా అలర్ట్
సీనియర్ శాస్త్రవేత్త దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జగత్సింగ్పూర్, గంజాం, ఖోర్ధా జిల్లాలు భారీ వర్షాల వల్ల ప్రభావితమవుతాయని, ఒడిశా తీరప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఒడిశా ప్రభుత్వం తన విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల బృందాలను సూచన తర్వాత సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఈ ప్రాంతం గత మూడు వేసవిలో తుఫానులను చూసింది. 2021లో 'యాస్', 2020లో 'అంఫాన్', 2019లో 'ఫణి'లకు ప్రభావితమైంది. కాగా, ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) 17 బృందాలు, ODRAF (ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) 20 బృందాలు, 175 అగ్నిమాపక శాఖ సిబ్బందిని కోరినట్లు ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (SRC) పీకే జెనా తెలిపారు. అదనంగా, ఏదైనా అత్యవసర పరిస్థితి కోసం మరో 10 బృందాలను రిజర్వ్ చేయాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులను అభ్యర్థించారు.
తుఫాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరాన్ని తాకుతుందా?
తుపాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరాన్ని తాకుతుందా లేదా అనేది చూడాలి. "ఇది ఎక్కడ ల్యాండ్ఫాల్ చేస్తుందనే దానిపై మేము ఇంకా ఎటువంటి అంచనా వేయలేదు. ల్యాండ్ఫాల్ సమయంలో సాధ్యమయ్యే గాలి వేగంపై కూడా మేము ఏమీ ప్రస్తావించలేదు" అని ఐఎండీ డీజీ మృతుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. అదేవిధంగా, కోల్కతాలోని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జికె దాస్ మాట్లాడుతూ.. " తుఫాను తిరిగి వంగి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం కూడా ఉంది. వాతావరణం మధ్య స్థాయిలలో వేడి, పొడి వాయువ్య గాలుల కారణంగా బలహీనపడవచ్చు. మరిన్ని ఆదివారం నాటికి స్పష్టత వస్తుంది'అని టెలిగ్రాఫ్ నివేదించింది.