తీవ్ర తుఫానుగా ‘సిత్రాంగ్’: బెంగాల్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఎన్డీఆర్ఎఫ్ రెడీ
న్యూఢిల్లీ: సిత్రాంగ్ తుఫాను ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను సిత్రాంగ్ స్థిరంగా కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. ఈ తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని, ప్రస్తుతం సాగర్ దీవికి 380 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారానికి ఉదయం బంగ్లాదేశ్లోని టికోనా సమీపంలో బరిసాల్ వద్ద తీరాన్ని దాటే సూచనలున్నాయని పేర్కొంది. అనంతరం వాయుగుండంగా, ఆ తర్వాత అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది.
తుఫాను సిత్రాంగ్ ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. తుపాను పరిసర ప్రాంతాల్లో 2.4 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఒఢిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమబెంగాల్ తీర ప్రాంత మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమబెంగాల్, మిజోరాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలపై తుఫాను ప్రభావం ఉండనుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
South 24 Parganas, WB | NDRF teams deployed at Gangasagar, Diamond Harbour, Kakdwip, Gosaba by the administration ahead of the Sitarang cyclone
— ANI (@ANI) October 24, 2022
Our team is on alert mode to carry out rescue operations: Sankar, NDRF Kolkata pic.twitter.com/k97ljAF5Va
మరోవైపు, 'సిత్రాంగ్' తుఫానుకు ముందు, పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని వివిధ ప్రదేశాలలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళ బృందాలను మోహరించారు. గంగాసాగర్, డైమండ్ హార్బర్, కక్ద్విప్, గోసాబా వద్ద పరిపాలన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాయి. "రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడానికి మా బృందం అలర్ట్ మోడ్లో ఉంది" అని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.