Cyclone Yaas: సూపర్ సైక్లోన్: ఉత్తరాంధ్ర హైఅలర్ట్: తీరాల్లో ఆర్మీ: రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో అది అతి తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందబోతోందని, అనంతరం యాస్ తుఫాన్ సూపర్ సైక్లోన్గా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావం మూడు రాష్ట్రాలపై ఉండబోతోంది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తోన్నాయి. తుఫాన్ వల్ల సంభవించే నష్టాన్ని నివారించడానికి ఆర్మీ సైతం రంగంలోకి దిగింది.
Recommended Video
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి అతి తీవ్ర తుఫాన్గా మారుతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతరం అది ఉత్తరం, ఆగ్నేయ దిశగా కదులుతుందని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని అంచనా వేసింది. దీని ప్రభావం ఏపీలోని ఉత్తరాంధ్ర సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 26వ తేదీన తీరాన్ని దాటొచ్చని, ఆ సమయంలో 170 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడానికి అవకాశం ఉందని వెల్లడించింది.

ఈ నెల 26న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం సహా ఒడిశా, బెంగాల్లల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లద్దని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో ఆర్మీ అప్రమత్తమైంది. ఒడిశాలోని జగత్సింగ్పూర్, పారాదీప్, చండీపూర్, బాలాసోర్, కేంద్రపారాలల్లో ఎనిమిది సైనిక కాలమ్స్, ఇంజినీరింగ్ టాస్క్ఫోర్స్ను మోహరింపజేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ తెలిపింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపింది. ఒడిశా, బెంగాల్లల్లో నౌకాదళాధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనబోతోన్నారు.
కోస్ట్గార్డ్ ఈస్టర్న్ సీబోర్డు, తూర్పు నౌకాదళం సంయుక్తంగా ముందస్తు చర్యలను ప్రారంభించాయి. తూర్పు సముద్రతీరంలోని తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని, ఓడలు, ప్లాట్ఫారాల భద్రతకు ఆయిల్ రిగ్ ఆపరేటర్లను సన్నద్ధం చేయడానికి రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సమన్వయం చేసుకొని పని చేస్తున్నామని కోస్ట్ గార్డ్ ఈస్టర్న్ సీబోర్డు తెలిపింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఒడిశా తీర ప్రాంతాల మార్గాల్లో ప్రయాణించే రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.












Click it and Unblock the Notifications