నిన్న సల్మాన్ ఖాన్..ఇప్పుడు కత్రిన కైఫ్-విక్కీ కౌశల్: ప్రాణహాని: బాలీవుడ్లో ఏం జరుగుతోంది?
ముంబై: అండర్ వరల్డ్ మాఫియాతో బాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఇదివరకు పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు మాఫియా డాన్లు ఫైనాన్స్ సపోర్ట్ను అందించాయనే విషయం పోలీసుల దర్యాప్తులోనూ వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక డ్రగ్ పెడ్లర్స్తో ఉన్న సంబంధాలపై ఇప్పటికీ దర్యాప్తు సాగుతోంది. స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు, సీబీఐ, నార్కొటిక్స్ బ్యూరో అధికారులకు దిమ్మ తిరిగేలా బాలీవుడ్లో డ్రగ్స్ వాడకం తెర మీదికి వచ్చింది.
ఈ పరిస్థితుల మధ్య బాలీవుడ్ సెలెబ్రిటీలకు ప్రాణహాని బెదిరింపులు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు కండలవీరుడు సల్మాన్ ఖాన్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు అందాయి. ప్రాణాలు తీస్తామంటూ అజ్ఞాతవ్యక్తుల నుంచి ఒకట్రెండు లేఖలను సైతం ఆయన అందుకున్నారు. దీనితో సల్మాన్ ఖాన్ పోలీసులను ఆశ్రయించారు. వ్యక్తిగత భద్రత కోసం ఆయుధ లైసెన్స్ కోరుతూ ఆయన ముంబై పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు.
సల్మాన్ ఖాన్తో పాటు ఆయన తండ్రి సలీం ఖాన్ను చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో గన్ లైసెన్స్ కోరారు. దీనికి సంబంధించిన ప్రకంపనలు తగ్గకముందే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ విక్కీ కౌశల్-కత్రిన కైఫ్కూ బెదిరింపులు మొదలయ్యాయి. చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు వారిద్దరినీ బెదిరించారు. దీనిపై సోషల్ మీడియాలో వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు. వాటిని విక్కీ కౌశల్-కత్రిన కైఫ్కు ట్యాగ్ చేశారు.
ఈ నేపథ్యంలో వారు పోలీసులను ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమను బెదిరించిన వారిపై శాంటాక్రజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తమకు అందిన పోస్టులతో కూడిన క్లిప్పింగ్స్ను అందజేశారు. వాటిని పరిశీలించిన అనంతరం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 506 (డీ), ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద కేసు పెట్టారు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని శాంటాక్రజ్ పోలీసులు తెలిపారు.
బెదిరింపులు ఏ ఐపీ నుంచి పోస్ట్ అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటున్నామని చెప్పారు. విక్కీ కౌశల్-కత్రిన కైఫ్కు భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంజాబ్కు చెందిన ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసె వాలా హత్యోదంతం అనంతరం బాలీవుడ్ సెలెబ్రిటీలకు ప్రాణహాని బెదిరింపులు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించారు. అతణ్ని అరెస్ట్ చేశారు.