దీపా పేరవై క్లోజ్: జయలలిత మేనకోడలు పరిస్థితి ఏంటీ ?
దిండిగల్ జిల్లాలోని చిన్నల్ పట్టిలో దీపా పేరవైని పూర్తిగా రద్దు చేసిన ఆ సంఘం నాయకులు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించి దీపా జయకుమార్ కు పెద్ద షాక్ ఇచ్చారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకాలం ఆమెకు మద్దతుగా ఉన్న దీపా పేరవై నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు.
తాజాగా శుక్రవారం దిండిగల్ జిల్లాలోని చిన్నల్ పట్టిలో దీపా పేరవైని పూర్తిగా రద్దు చేసిన ఆ సంఘం నాయకులు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించి దీపా జయకుమార్ కు పెద్ద షాక్ ఇచ్చారు.
దిండిగల్ లోని చిన్నల్ పట్టిలో దీపా పేరవైకి బలమైన నాయకత్వం ఉంది. అయితే దీపా తీసుకుంటున్న నిర్ణయాలతో అక్కడి నాయకులు విసుగు చెందారని సమాచారం. దీపా పేరవైకి చెక్ పెట్టి జయలలితకు నమ్మకస్థుడైన పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్నామని స్థానిక నాయకులు అంటున్నారు.
ఇప్పటికే ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు మూడు వర్గాలుగా చీలిపోయారు. దీపా, పన్నీర్ సెల్వం, శశికళ వర్గంలో వారు పని చేస్తున్నారు. ఇప్పుడు దీపా పేరవై నాయకులు దూరం కావడంతో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆందోళనకు గురౌతున్నారు.