పాక్ పై యుద్దానికి మరో అడుగు ? ప్రధాని మోడీతో రక్షణ కార్యదర్శి భేటీ..!
పహల్గాం తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధిస్తున్న భారత్ ఇప్పుడు సైనిక దాడికి సిద్దమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ లతో భేటీ అయి వారి సన్నద్ధత తెలుసుకున్న ప్రధాని మోడీ.. ఇవాళ రక్షణశాఖ కార్యదర్శితోనూ సమావేశమయ్యారు. పాకిస్తాన్ పై దాడికి అవసరమైన చర్యలపై ఆయనతో ప్రధాని చర్చించారు. ఇది పాకిస్తాన్ పై దాడికి భారత్ వేసిన మరో అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై పరిమిత దాడికి భారత్ సిద్దమవుతోందన్న అంచనాల నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కలిశారు. నిన్న ప్రధాని మోడీ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ను కలిశారు. ఈ నేపథ్యంలో ఇవాళ రక్షణశాఖ కార్యదర్శితో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ పై ఏ స్థాయి యుద్దం చేయాల్సి ఉంటుంది, అందుకు అవసరమైన ఆర్ధిక వనరులు, ఇతర అంశాలపై రక్షణ కార్యదర్శితో ప్రధాని చర్చించినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉన్నతాధికారులు పలుమార్లు భేటీ అయ్యారు. ఇందులో భారత్ ఏ స్థాయిలో పాకిస్తాన్ పై దాడి చేస్తే మనకు ఇబ్బంది లేకుండా ప్రత్యర్ధికి హెచ్చరికలు పంపినట్లు అవుతుందనే దానిపై చర్చిస్తున్నారు. మీరు కోరుకుంటోంది ప్రధాని మోడీ నేతృత్వంలో జరగబోతోందంటూ నిన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇచ్చిన సంకేతం నేపథ్యంలో కచ్చితంగా పాకిస్తాన్ పై దాడి తప్పదని తేలిపోయింది.
ఒక దేశంగా భారతదేశం యొక్క భౌతిక భద్రతను ఎల్లప్పుడూ మన సైనికులు చూసుకుంటారని, రక్షణ మంత్రిగా, దేశ సరిహద్దుల భద్రతను కాపాడేందుకు సైనికులతో కలిసి పనిచేయడం తన బాధ్యతని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అలాగే మన దేశాన్ని బెదిరించే వారికి తగిన సమాధానం ఇవ్వడం తన విధి అని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వరుస భేటీల వెనుక కచ్చితంగా ప్రతీకార దాడి వ్యూహాలు ఖరారవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications