60 ఏళ్లు పైనున్న వారికి ఉచిత వైద్యం: రేపట్నుంచి డోర్ టు డోర్ రిజిస్ట్రేషన్లు: అదొక్కటే షరతు
Arvind Kejriwal: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకొద్ది రోజుల్లొ దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడనుంది. షెడ్యూల్ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తోన్నారు.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటుబ్యాంక్. 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది.

అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తోన్నారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి. ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. సామాన్య ప్రజలను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వస్తోంది. అధికారంలో ఉండటం వల్ల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వాటి అమలుకు శ్రీకారం చుడుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వాటిని కొనసాగిస్తామనీ చెబుతోంది.
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు ప్రతి నెలా 1,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని గతంలో ప్రకటించారు కేజ్రీవాల్. ఈ మొత్తాన్ని 2,100 రూపాయలకు పెంచారు. విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరల వల్ల పేదలు, మధ్య తరగతి కుటుంబీకులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
తాజాగా మరో పథకాన్ని ప్రకటించారు కేజ్రీవాల్. ఈ మధ్యాహ్న ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా సంజీవని యోజనను త్వరలోనే అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు వెల్లడించారు. 60 సంవత్సరాలకు పైన వయస్సున్న వారికి ఉచితంగా వైద్య సహాయాన్ని అందించడానికి సంజీవని యోజనను అమలు చేయనున్నట్లు చెప్పారు.
అనేక కుటుంబాల్లో- పదవీ విరమణ చేసిన తరువాత గానీ, 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిని గానీ ఎవరూ పట్టించుకోవట్లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఎక్కువగా ఎదుర్కొనేది అనారోగ్య సమస్యలేనని, అందుకే వారికి ఉచిత వైద్యాన్ని అందించాలని సంకల్పించినట్లు చెప్పారు.
సంజీవని యోజన, గతంలో ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజన కోసం సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమౌతాయని కేజ్రీవాల్ వెల్లడించారు. తన టీమ్ ప్రతి ఇంటికీ వెళ్లి రిజిస్ట్రేషన్లు చేపడుతుందని వివరించారు.
ఈ పథకానికి ఎలాంటి అర్హతలు అవసరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటరు గుర్తింపు కార్డు ఉంటే చాలని తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు చూపించి 60 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications